నేడు ఏసు పుట్టిన రోజు
జిల్లాలో చర్చిల ముస్తాబు
ప్రధాన కూడళ్లలోనూ వెలుగులు
అర్ధరాత్రి నుంచే వేడుకలు
గిఫ్ట్ ప్యాక్లతో సంబురం
జగిత్యాల టౌన్/ ఓదెల, డిసెంబర్ 24: క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు సూక్ష్మకళాకారులు అద్భుత కళాఖండాలు రూపొందించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తులసినగర్కు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ గుండు పిన్నుపై క్రిస్మస్ వేడుకల కళారూపాన్ని తయారు చేసి నిలిపాడు. సిలువ, క్రిస్మస్ చెట్టు, శాంటాక్లాస్ మంచు పర్వతాలు నిలిపినట్లు పేర్కొన్నారు. 1.5 మిల్లీమీటర్ల పొడవు, 2.5 మిల్లీమీటర్ల వెడల్పుతో సుమారు 10 గంటలు కష్టపడి కళాఖండాన్ని తయారు చేసినట్లు తెలిపారు.
ఏసుక్రీస్తు జన్మించిన శుభదినాన్నే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్గా జరుపుకుంటారు. మెర్రి క్రిస్మస్ అంటే ఆనందం, సంతోషం అని అర్థం. సమస్త మానవాళిని పాప విముక్తులను చేసి దైవ సన్నిధి చేర్చేందుకు ఏసు ప్రభువు మానవ రూపంలో జన్మించాడని చెబుతారు. నజరేతు గ్రామంలో నివసించే సామాన్య కన్య మరియ. ఆమె గొప్ప దైవ భక్తురాలు. ఆమెకు వడ్రంగి యువకుడైన యోసేపుతో వివాహం నిశ్చయమవుతుంది. దైవ సంకల్పంతో మరియ గర్భం దాల్చింది. యోసేపు తన స్వగ్రామమైన బెత్లేహాంకు నిండు చూలాలైన మరియను తీసుకెళ్తాడు. పశువుల పాకలో మరియ కుమారుడికి జన్మనిచ్చి పశువుల తొట్టెలో పడుకోబెడుతుంది. పొలాల్లో పశువులను కాసే కాపరులకు దేవదూతలు కనిపించి, ‘మీకు రక్షకుడు పుట్టాడు’ అని తెలిపి అదృశ్యమవుతారు. ఆ కాపరులు పశువుల పాకకు వెళ్లి బాల ఏసును చూసి దేవుని మహిమను లోకానికి తెలియజేశారు. ఇలా మానవాళి పాపాలను ప్రక్షాళన చేసేందుకు ఏసు జన్మించాడంటారు. అందుకే క్రైస్తవులు క్రిస్మస్ను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
వేడుకలకు సిద్ధం..
క్రిస్మస్ను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు క్రైస్తవులంతా సిద్ధమయ్యరు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఉన్న చర్చిలలో ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని క్రైస్తవ ప్రార్థన మందిరాలు నూతనశోభ సంతరించు కున్నాయి. శుక్రవారం రాత్రి దారులన్నీ వెలుగులు విరజిమ్మాయి. అర్ధరాత్రి నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనా మందిరాలు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. శనివారం ఆయా చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు, మతపెద్దలు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి.
చాక్పీస్పై శాంటాక్లాస్
ఓదెల మండలం మడకకు చెందిన ప్రభుత్వ ఆర్ట్ టీచర్ ఆడెపు రజినీకాంత్ చాక్పీస్పై పలు రకాల ఖండాలు చెక్కాడు. 4సెంటీమీటర్ల పొడవులో శాంటాక్లాస్, 2.5సెంటీమీటర్ల పొడవు క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ స్టార్తోపాటు 5మిల్లీ మీటర్ల పొడవులో హ్యాపీ క్రిస్మస్ అని ఇంగ్లిష్ అక్షరాలను 4గంటల పాటు శ్రమించి చెక్కినట్లు చెప్పారు.