భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఒక్కసారి అనుసంధానమైతే ఇక సర్వహక్కులూ సొంతం
వచ్చిన ప్రతి దరఖాస్తునూ వెంటనే పరిష్కరిస్తున్నం
ఏ ఆప్షన్లో దరఖాస్తు చేసుకోవాలో తెలిస్తే పరిష్కారం సులువు
మీసేవ నిర్వాహకులకు మరోసారి శిక్షణ ఇస్తాం
పెద్దపల్లి, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): ధరణి వచ్చిన తర్వాత దశాబ్దాల కాలంగా నెలకొన్న వివాదాలకు తెరపడుతున్నది. ఎన్నో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతున్నది. తలెత్తుతున్న సమస్యలకు అనుగుణంగా కొత్త కొత్త ఆప్షన్లు వస్తున్నాయి. వాటితో క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్ సంగీత సత్యనారాయణ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. అర్జీలు అందిన వెంటనే సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు. ఫిర్యాదులు వచ్చిన వారంలోనే పరిష్కరిస్తున్నాం. సరైన విధానంలో దరఖాస్తు చేసుకుంటే పరిష్కారం ఈజీ అవుతుంది.
వ్యవసాయ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణిని అమల్లోకి తెచ్చారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ధరణి వచ్చిన తర్వాత రెవెన్యూలోని అనేక లోపాలు బహిర్గతమయ్యాయి. ఆ లోపాలన్నీ సరిచేయడం ఒక్క ధరణి వల్లే సాధ్యమైంది. ఇంకా అనేక కొత్త కొత్త సమస్యలు ముందు కు వస్తున్నాయి. వాటికనుగుణంగా ప్రభుత్వం కొత్త కొత్త ఆప్షన్లు ఇస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నది. కలెక్టర్ డా. సర్వే సంగీత సత్యనారాయణ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. జిల్లాలో వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. సమస్యపై అర్జీ పెట్టుకునే ముందే ఏ ఆప్షన్లో దరఖాస్తు చేసుకోవాలో తెలిస్తే పరిష్కారం సులువు అవుతుంది’ అని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే : ధరణికి ముందు భూ సమస్యలు ఎలా పరిష్కరించారు?
అదనపు కలెక్టర్: ధరణి రాక ముందు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం. అప్పుడు పెద్ద సంఖ్యలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించాం. భూ వివాద రహిత జిల్లాగా ప్రకటించాం. పార్ట్బీలో 1,42,000 సర్వే నంబర్లు ఉండగా, ధరణి వచ్చే నాటికి 28వేలకు తగ్గించాం.
నమస్తే: ధరణి అమలు తర్వాత వచ్చిన అర్జీలెన్ని? అందులో పరిష్కారమైనవి ఎన్ని?
గతేడాది సెప్టెంబర్ 7 నుంచి మొదట 10ఆప్షన్లతో ధరణి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆప్షన్ల సంఖ్య 36 వరకు చేరింది. తహసీల్దార్ల నుంచి రికార్డ్ అథారిటీ జిల్లా కలెక్టర్ వద్దకు వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 16,129 అర్జీలు వచ్చాయి. అందులో 15,574వరకు పరిష్కారమయ్యాయి. కలెక్టర్ డా. సర్వే సంగీత సత్యనారాయణ ప్రతి దరఖాస్తునూ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.
నమస్తే: జిల్లాలో ఎక్కువగా ఎలాంటి సమస్యలు వచ్చాయి?
పెండింగ్ మ్యుటేషన్లకు సంబంధించి 5,478 అర్జీలు వచ్చాయి. వాటన్నింటినీ పరిష్కరించాం. గ్రీవెన్స్ రిలేటెడ్ టూ ల్యాండ్ మ్యాటర్స్కు సంబంధించి 7,031 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 6,838 పరిష్కారమయ్యాయి. ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో ఉన్నవని 1,529 అర్జీలు రాగా, 1,343 క్లియర్ చేశాం. వస్తున్న సమస్యలకు అనుగుణంగా కొత్త కొత్త ఆప్షన్లను ఇస్తున్నారు. ఆ ఆప్షన్లతో క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయి.
నమస్తే: అర్జీల పరిష్కారంలో ఎందుకు జాప్యం జరుగుతున్నది?
ధరణి సమస్యలకు సంబంధించి చాలా మంది తప్పు గా దరఖాస్తు చేసుకుంటున్నారు. సరైన విధానంలో దరఖాస్తు చేస్తే సమస్య సులువుగా పరిష్కారమవుతుంది. మీ సేవ నిర్వాహకులు సమస్య ఒకటైతే దరఖాస్తు మరో విధానంలో చేస్తున్నారు. అలాంటి కారణాల వల్ల సమస్యల పరిష్కారంలో కాస్త జాప్యం జరుగుతున్నది. త్వరలోనే జిల్లాలోని మీసేవ నిర్వాహకులకు మరోసారి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
నమస్తే: జిల్లాలో ఇంకా ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి?
ధరణి సమస్యలకు సంబంధించి జిల్లాలో ఇంకా 555 సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అందులో కోర్టు పెండింగ్లో 193, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో 186 వరకు ఉన్నాయి.
నమస్తే: ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో పడితే ఏం చేయాలి?
డిజిటల్ సంతకాలు అయినవి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో ఉంటే సులువుగానే పరిష్కారమవుతున్నాయి. డిజిటల్ సంతకాలు కాకుండా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో పడితే మాత్రం పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి వాటిని వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ సైన్ అయి ప్రొహిబిటెడ్లో ఉన్నవి గ్రామాల వారీగా తీసి.. క్షుణ్ణంగా పరిశీలించి 202గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాం. డిజిటల్ సైన్ అయిన వాటికి మాత్రం ప్రత్యేకమైన దరఖాస్తు పెట్టుకుంటే పరిష్కరిస్తున్నాం.
నమస్తే: వ్యవసాయ భూమి నాలాగా పడితే ఏం చేయాలి? అలాగే నాలా కన్వర్షన్ చేసుకోవాలంటే ఏం చేయాలి?
దీనికి ఆప్షన్ ఉంది. వ్యవసాయ భూమి నాలాగా పడితే.. తిరిగి అగ్రికల్చర్ భూమిగా మార్చుకోవచ్చు. దరఖాస్తు చేసుకుంటే ఈజీగా పరిష్కారం అవుతుంది. నాలా విత్ పీపీబీ, నాలా వితౌట్ పీపీబీ అని ఉంది. వీటిని చూసి అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ ద్వారా అప్రూవల్ వస్తుంది. అప్పుడు తహసీల్దార్ ద్వారా నాలా కన్వర్షన్ ప్రొసీడింగ్ వస్తుంది.
నమస్తే: ఫిర్యాదులు వచ్చిన ఎన్ని రోజుల్లో సమస్యను పరిష్కరిస్తున్నారు?
ఫిర్యాదులు వచ్చిన వారం రోజుల్లోనే కలెక్టర్ వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత అధికారులకు వాటిని పంపి పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు.
నమస్తే: పుట్టిన తేదీ ఇతర వివరాలు ఎలా మార్చుకోవచ్చు?
ఆధార్లో ఉన్న పేరు ప్రకారం మార్పిడికి ఆప్షన్ ఉంది. పుట్టిన తేదీ వివరాలను కూడా మార్చుకునేందుకు ఆప్షన్ ఉన్నది. కానీ, రెండింటికీ ప్రొసీజర్స్ వేర్వేరుగా ఉన్నాయి.
నమస్తే: ఇంకా ఏ రకమైన సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నది?
ఒకరి భూమి మరొకరి పేరుపై తప్పు గా నమోదైనా.. ఒకరి భూమిలోని విస్తీర్ణంలో తేడాలు రావడం, పట్టా భూమి అసైన్డ్ భూమిగా తప్పుగా రికార్డు కావడం, ధరణిలో సర్వే నంబర్ కనిపించకపోవడం.. ఒకే సర్వే నంబర్లో రెండు సర్వే నంబర్లు ఉండడం.. లాంటివి పరిష్కారం కావాల్సి ఉన్నది.
నమస్తే: ధరణి సమస్యల పరిష్కారానికి చివరగా ప్రజలకు మీరిచ్చే సలహా?
ముందు సమస్యపై స్పష్టంగా తెలుసుకోవాలి. తర్వాత మీ సేవ నిర్వాహకులకు తెలియజేయాలి. ఆ ఆప్షన్లకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలి. వారంలోగా సమస్య పరిష్కారమవుతుంది.