రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) /ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట: ఒమిక్రాన్ కలకలం రేపుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో కేసు నమోదైంది. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లో ఒకరికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి ధర్మానాయక్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన ఒమిక్రాన్ బాధితుడు నారాయణపూర్లో జరిగిన ఓ విందుకు హాజరయ్యాడు. ఈ క్రమంలో ఆ విందుకు హాజరైన 53 మందికి పరీక్షలు చేయడంతో ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. అయితే నారాయణపూర్ వాసికి ప్రైమరీ కాంటాక్ట్ అయిన వారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
గూడెం సెల్ఫ్ లాక్ డౌన్
గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 16న దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అయితే హైదరాబాద్ విమానాశ్రయంలో వైద్యాధికారులు అతనికి కరోనా పరీక్షల కోసం రక్త నమూనాలు తీసుకున్నారు. పరీక్షల్లో అతనికి ఒమిక్రాన్ ఉన్నట్లు గుర్తించి జిల్లా వైద్యాధికారులకు ఈ నెల 20న సమాచారం ఇచ్చారు. స్పందించిన వైద్య సిబ్బంది వెంటనే మెరుగైన వైద్యం కోసం బాధితుడిని హైదరాబాద్కు తరలించారు. ఇంటినంతా శానిటైజ్ చేసి కుటుంబ సభ్యులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. బాధితుడి తల్లికి, భార్యకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. చంద్రం విందులో పాల్గొన్న సమాచారంతో మరో పదిహేను మందిని గుర్తించి హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. కాగా, ఒమిక్రాన్ వెలుగు చూసిన నేపథ్యంలో గ్రామస్తులు ఈ నెల 23 నుంచి జనవరి రెండో తేదీ వరకు సెల్ఫ్లాక్ డౌన్ విధించుకున్నారు. వ్యవసాయ పొలం పనులకు వెళ్లే వారు సైతం ఉదయం ఆరుగంటలకు ముందే ఇండ్ల నుంచి ఒక్కొక్కరు మాత్రమే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో గుంపులుగా ఉండరాదని, భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ఆంక్షలు విధించుకున్నారు. ఉదయం పది గంటల తర్వాత దుకాణాలు, వ్యాపారాలను మూసివేస్తున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెయ్యి జరిమానా విధిస్తున్నారు. కాగా, ఒమిక్రాన్ సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులు హోంక్వారంటైన్లో ఉన్నారు. సర్పంచు చిట్నేని సరిత భర్త శ్రీనివాసరావు వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా గ్రామంలో నిత్యావసర వస్తువులు అవసరమైన వారి ఇంటికి వచ్చి డెలివరీ చేసేలా ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు.
వైద్య సిబ్బంది అప్రమత్తం..
జిల్లాలో ఒమిక్రాన్ వెలుగు చూసిన నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యా ప్తంగా ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఇళ్లిల్లు తిరుగుతూ ప్రజల బాగోగులు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే గూడెం గ్రామంలో ఒక కేసు నమోదు కావడం, తాజాగా నారాయణపూర్ వాసికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అతనితో కలిసి శుభకార్యాలలో పాల్గొన్న వారి స మాచారం సేకరిస్తున్నారు. ప్రజలు తప్పని సరి గా మాస్కులు ధరించాలని, విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఆంక్షలు విధించుకున్నం..
దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ రావడంతో గ్రామ ప్రజలంతా కలిసి నిర్ణయం తీసుకున్నం. స్వచ్ఛందంగా పదిరోజుల పాటు లాక్డౌన్ విధించాలని తీర్మానించుకున్నం. ఇందులో ఎవరి ఒత్తిడి లేదు. బాధితుడి తల్లి, భార్య ఇద్దరు పిల్లలను హోంక్వారంటైన్లో ఉంచినం. వారికి మేమే ఉచితంగా నిత్యావసర వస్తువులు అందిస్తున్నం. ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఎవరికి వారే స్వీయనియంత్రణలో ఉండాలని ఆంక్షలు విధించుకున్నం.