ముగ్గురి నామినేషన్ల తిరస్కరణ
రేపటి వరకు ఉపసంహరణకు గడువు
కరీంనగర్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానిక ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన పూర్తయింది. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బుధవారం ఆధ్వర్యంలో ఎన్నికల పరిశీలకుడు టీ విజయ్కుమార్ సమక్షంలో స్క్రూటీని చేపట్టారు. వివిధ కారణాలతో స్వతంత్ర అభ్యర్థులైన శ్రీకాంత్ సిలివేరు, రాజు పిడిశెట్టి, వేముల విక్రమ్రెడ్డి నామినేషన్లు తిరస్కరించామని ప్రకటించారు. ఈ నెల 16న స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆ రోజు నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించారు. 27 మంది అభ్యర్థులు 53 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు. టీఆర్ఎస్ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన టి.భానుప్రసాద్రావు, ఎల్.రమణ నామినేషన్లు సహా మిగతా 24 మంది నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ తదితరులు పాల్గొన్నారు.
నేడు, రేపు ఉపసంహరణకు గడువు..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో సమర్పించిన ముగ్గురి నామినేషన్లు తిరస్కరించగా మరో 24 మంది మిగిలారు. వీరిలో కొందరు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నది. ఇందుకు ఈ నెల 25, 26 వరకు గడువు ఉన్నది. బరిలో నిలిచేదెవరనేది ఈ నెల 26 సాయంత్రం వరకు తెలిసిపోతుంది.