HomeKarimnagar24 Hours Free Current Lights For Five Years
విద్యుత్ విజయం
24 గంటలపాటు ఉచిత నాణ్యమైన విద్యుత్.. ఎప్పుడంటే అప్పుడు పొలం వద్దకు వెళ్లి కరెంట్ పెట్టుకునే వీలు.
ఐదేళ్లుగా 24 గంటల ఉచిత కరెంట్ వెలుగులు
2017 డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి సాగుకు ఫ్రీ కరెంట్
గతం కంటే భారీగా పెరిగిన వినియోగం
అయినా నిరంతరాయంగా సరఫరా
సంబురంగా సేద్యం
సీఎం కేసీఆర్కు రైతన్న కృతజ్ఞతలు
తెలంగాణ రాకముందు నిత్యం కరెంట్ కోతలు.. రాత్రనకా, పగలనకా బాయిల కాడ పడిగాపులు.. కరెంట్ వచ్చిందని సంతోషపడేలోపే లోవోల్టేజీతో కాలే మోటర్లు, పటాకుల్లా పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు.. కండ్ల ముందే ఎండే పంటలు.. అది చూసి అన్నదాతల ఆత్మహత్యలు.. రాత్రిపూట పొలం దగ్గరకు పోయిన రైతన్న ఇంటికి తిరిగి వస్తడో రాడో తెలియని పరిస్థితులు.. పాముకాటో.. లేదంటే విద్యుత్ షాక్తోనో అర్ధాంతరంగా గాల్లో కలిసే ప్రాణాలు..
– ఇది నాటి సమైక్య పాలనలో సంక్షోభం
24 గంటలపాటు ఉచిత నాణ్యమైన విద్యుత్.. ఎప్పుడంటే అప్పుడు పొలం వద్దకు వెళ్లి కరెంట్ పెట్టుకునే వీలు.. పండుగలా ఎవుసం.. రైతన్న నిరందీగా సేద్యం.. 2014కు ముందు పోలిస్తే 55శాతానికి పైగా పెరిగిన సాగు విస్తీర్ణం.. ఏడాదికి రెండు పంటలు.. బంగారంలాంటి దిగుబడులు.. అన్ని రంగాల్లో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. డిమాండ్కు సరిపడా కనురెప్పపాటు పోకుండా కరెంటు సరఫరా.. ఇది స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన విజయం. తెలంగాణ వస్తే ఏమొస్తదన్న వాళ్లకు నేటి వ్యవసాయరంగ ప్రగతే ఒక సమాధానం. 4 గంటల నుంచి 24 గంటలకు చేరిన విద్యుత్ సరఫరానే ఒక నిదర్శనం.
– ఇది నేటి కేసీఆర్ పాలనలో కనిపించే సంక్షేమం
‘తెలంగాణ వస్తే చీకటి మయమవుతుంది. సాగుకు కనీసం నాలుగు గంటలిచ్చే పరిస్థితి ఉండదు. దీనివల్ల వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది.’ ఇలా ఆనాడు ఆంధ్రా పాలకుల కూతలు. కానీ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో కరెంట్ నిరంతరాయంగా వెలుగులు పంచుతున్నది. 2017 డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి ఇస్తున్న 24గంటల ఉచిత కరెంట్ అద్భుతాల్ని సృష్టిస్తున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అప్పటికే ఆరు నెలల ముందు నుంచే (జూలై 18) ప్రయోగాత్మకంగా సరఫరా మొదలై, ఆ తర్వాత రాష్ట్రమంతటికీ విస్తరించింది. ఐదేళ్ల నుంచి ఎలాంటి అంతరాయం లేకుండా కరెంట్ ఇస్తుండగా కర్షకలోకం సంబురంగా ఎవుసం చేసుకుంటున్నది.
– కరీంనగర్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ)
రైతుల బాధలు పోయినయ్..
.. పచ్చని పొలం మధ్య నీళ్లు పోస్తున్న కరెంట్ పంపు వద్ద చిరునవ్వుతో కనిపిస్తున్న ఈ రైతు పేరు జంగిలి మల్లయ్య. కొత్తపల్లి మండలం కమాన్పూర్. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా సరఫరా చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్కు నేటితో ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మల్లయ్యను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా, గతంలో కరెంట్ ఎలా ఉన్నది? ఇప్పుడెలా ఉన్నదో పూసగుచ్చినట్లు వివరించాడు. ‘తెలంగాణ రాక ముందు నాకున్న ఆరెకరాల్లో కేవలం రెండెకరాల్లోనే వరి నాటేసేది. మిగిలిన నాలుగెకరాల్లో పల్లి, పత్తి, మక్క వేసేది. అప్పుడు కరెంటు సక్కగ లేక ఏ ఒక్కటీ పూర్తిగా చేతికి రాకపోయేది.
కరెంట్ ఎప్పుడుండేదో తెల్వకపోయేది. ఒకరు ఎప్పటికీ ట్రాన్స్ఫార్మర్ కాన్నే ఉండి ఫ్యూజ్ వైర్లు, జంపర్లు ఎగిరి పోకుండా చూసేది. రాత్రి పూట కరెంట్ కాడికి వచ్చి పోవుడు శానా ఇబ్బందయితుండె. చేసేదేంలేక పొలంకాన్నే పడుకునెటోడిని. అదంతా ఓ పీడకల. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ కృషితో రైతుల బాధలు పోయినయ్. ఐదేళ్ల సంది 24గంటల కరెంట్ ఉంటంది. ఎప్పుడు వీలుంటే అప్పుడే పొలానికి నీళ్లు పెట్టుకుంటున్న. ఆరెకరాల్లో మొత్తం వరే సాగు చేస్తున్న. ఈ ఐదేండ్లలో ఒక్క పసలుకు కూడా నీళ్లు లేక, కరెంట్ లేక ఎండిపోలేదు’ అని చెబుతున్నాడు. ఇది ఒక్క జంగిలి మల్లయ్య మనోగతమే కాదు, తెలంగాణలో ఉన్న రైతులందరిలోనూ ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమవుతున్నది.
ంనగర్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కష్టాలు చెప్పనలవిగానివి. ఒక్క రైతాంగం మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు వచ్చీరానీ కరెంట్తో అష్టకష్టాలు పడ్డారు. అందులో రైతులు పడ్డ బాధలు ఇన్నీ అన్నీ కావు. కరెంట్ కోసం ధర్నాలు, ఆందోళనలు, సబ్స్టేషన్ల ముట్టడి, రాస్తారోకోలు అప్పట్లో నిత్యకృత్యాలు. రాత్రి వేళ వచ్చే కరెంట్ కోసం పొలాల వద్దకు వెళ్లే రైతులు విద్యుత్ షాక్లు, పాము కాట్లతో మృత్యువాత పడడం సర్వసాధారణంగా కనిపించేది. ఇలా ఎన్నో కుటుంబాలు తమ పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డాయి. తెలంగాణ ఉద్యమానికి కరెంట్ సమస్య కూడా ఒక కారణమైంది. వ్యవసాయానికి రోజులో ఆరు గంటలు మాత్రమే ఇచ్చేవారు.
ఇందులోనూ రాత్రి, పగలు విడదీయడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. ప్రతి ప్రాంతంలో లో ఓల్టేజీ కారణంగా నిత్యం అటు ట్రాన్స్ఫార్మర్లు, ఇటు మోటర్లు కాలిపోయేవి. కాలిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో మరొకటి బిగించాలంటే రోజులు పట్టేది. ఫలితంగా రైతుల పొలాలు ఎండి పనికి రాకుండా పోయేవి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి పొద్దంతా ఆరు గంటల నాణ్యమైన కరెంట్ను ఇచ్చే ప్రయత్నం చేసింది. 2016 ఏప్రిల్ 1 నుంచి 9 గంటలకు పెంచింది. క్రమంగా విద్యుత్తు వ్యవస్థను బలోపేతం చేసి 24 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు
రాష్ట్రం అంతటా 2017 డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి 24 గంటల ఉచిత కరెంట్ అమలులోకి వస్తే.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మాత్రం 2017 జూలై 18 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేశారు. వ్యవసాయం కోసం ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధికంగా విద్యుత్తును వినియోగించేవారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రయోగాత్మకంగా అమలు చేసి సాంకేతిక సమస్యలను పరిశీలించారు. ఇక్కడ విజయవంతం కావడం, సాంకేతికంగా ఎదురైన సమస్యలను రాష్ట్ర మంతటా మదింపు చేసుకున్న ప్రభుత్వం రాష్ట్రమంతటా అమలు చేయగలిగింది.
కరీంనగర్ విభజిత జిల్లాలో 92,346 వ్యవసాయ కనెక్షన్లు ఉండేవి. అప్పుడు అన్ని రంగాలకు ప్రతి రోజూ 6.200 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండేది. ఇప్పుడు 1,01,099 వ్యవసాయ కనెక్షన్లకు చేరుకోగా ప్రతిరోజూ 10.194 మిలియన్ యూనిట్లకు వినియోగం పెరిగింది. ఇందులో వ్యవసాయ రంగానికే 30 శాతం విద్యుత్ వినియోగమవుతోంది. అంటే ఒక్క కరీంనగర్ జిల్లాలో 24 గంటల ఉచిత కరెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.100 కోట్ల చొప్పునఖర్చు చేస్తోంది.
నాణ్యమైన కరెంటు వస్తున్నది
స్వరాష్ట్రంలో మాకు నాణ్యమైన కరెంట్ అందుతున్నది. గతంలో కరంట్ కోసం పొలాల వద్ద పడిగాపులు కాసేటోళ్లం. ఇప్పుడు మాకా బాధలు లేవు. తెలంగాణ వచ్చినంక రైతుల బాధలు పోయినయ్. ఇంట్ల హాయిగ పండుకొని పొలం పారిచ్చుకుంటున్నం. నాకున్న 4 ఎకరాల్లో నీళ్లకు ఎలాంటి ఢోకా లేదు. పుష్కలంగా పంటలు పండించుకుంటున్న.
– ఊదరి పోచాలు, కాల్వశ్రీరాంపూర్
ఫ్రీ కరెంట్తోనే మళ్లీ సాగు బాట..
ఈయన పేరు పోగుల మల్లయ్య.. పెద్దపల్లికి చెందిన రైతు. ఈయనకు రెండేకరాల భూమి ఉన్నది. పదేండ్ల కిందట తన భూమిలో బాయిని తవ్వించాడు. బాయి నిండా నీళ్లుండేది. కానీ కరెంట్లేక ఉన్నభూమిలో కొంతనే సాగుజేసేది. మిలుకు మిలుకు మంటూ వచ్చిపోయే కరెంట్తో అదిగూడా ఎండిపోయేది. దీంతో తీవ్ర నష్టాల పాలైన మల్లయ్య 2016లో సాగును పక్కన పెట్టి ఆటో కొనుక్కున్నాడు. ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో తిరిగి పలుగు పార పట్టి సాగు మొదలు పెట్టాడు. ఒక వైపు ఫ్రీ కరెంటు సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సాగుకు ప్రోత్సాహంతో ఆనందంగా లాభ దాయకంగా రెండెకరాల పొలం పండిస్తూ తన ఇద్దరు పిల్లలను సాకుతూ ఆనందంగా గడుపుతున్నాడు.
-పోగుల మల్లయ్య, పెద్దపల్లి మండలం
ఐదేండ్ల నుంచి గోస తప్పింది..
ఎవుసానికి సరిపడా కరెంట్ లేక నానా బాధలు పడే వాళ్లం. మోటర్లు కాలిపోయి తీవ్రంగా నష్టపోయేటోళ్లం. కండ్లళ్ల నీళ్లు నింపుకొని కరెంటు ఆఫీసుకాడ ధర్నాలు చేసే టోళ్లం. ఈ కరెంటు అచ్చుడేంది.. పోవు డేందని.. లో ఓల్టేజీతో మోటార్లు కాలుడేందని బాధనంతా వెల్లబోసు కునేటోళ్లం. ఈ ఐదేండ్ల నుంచి కరెంటు గోస తప్పింది. రాత్రనకా పగలనకా పొలం కాడికి తిరిగే బాధలు తప్పినై. మంచి కరెంట్ అందుతున్నది. రెండు పంటలు పండించుంట సంతోషంగా ఉన్నం.
– పోచంపల్లి రాజయ్య, పెద్దపల్లి మండలం
పంటలు పండుతలేవని పిల్లనియ్యలే…
మాది పెద్దూరు. మా నాయిన నర్సయ్యకు ఐదుగురు అన్నదమ్ములున్నరు. అందరికీ ఎకరన్నర చొప్పున భూముంది. అన్నీ ఒకే దగ్గరున్నయ్. నాడు కరెంటు ఉండేది కాదు. అందరం కలిసి సిరిసిల్ల నుంచి జనరేటర్ కిరాయికి తెచ్చి పెట్టుకుని తెల్లందాక పొలానికి నీరు పారించినం. అయినా మడులు తడవక ఎకరన్నరలో 20 గుంటలకే నీరందేది. ఏసిన వరి చేతికి రాక అప్పుల పాలయినం. సిరిసిల్లలో సుతారి పనికి పోయిన. లగ్గం చేసుకుందామంటే పిల్లనియ్యలే.
చదువు రాని నేను ఇక్కడుంటే బతకుదెరువు లేదని పదేళ్ల కింద మస్కట్కు పోయిన. మళ్లీ వచ్చినా ఇక్కడ కరెంటులేక పంటలు పండుతలేవని, బతుకుడు ఇబ్బందయితదని నాకు పిల్లనివ్వలే.. మళ్లీ మస్కట్పోయి అక్కడే కూలీ పనిచేసిన. కేసీఆర్ సార్ వచ్చినంక 24 గంటలపాటు కరెంటు ఉంటుందని మా నాయిన ఫోన్ చేసి చెప్పిండు. దీంతో తిరిగొచ్చి పంట సాగు చేసుకుంటున్న. మొత్తం పారుతున్నది. దిగుబడి బాగా వస్తున్నది. గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన భావనతో పెళ్లయ్యింది. కేసీఆర్సార్ కరెంటు ఇయ్యవట్టే నాకు పెళ్లయ్యింది. సార్కు మా కుటుంబమంతా రుణపడి ఉంటది.
– జెట్టి రాజు, పెద్దూరు, సిరిసిల్ల అర్బన్ మండలం
నాడు కూలోన్ని.. ఇప్పుడు ఓనర్నయిన
మాకు ఎకరం భూమి ఉంది. మానాన్న, నేను పొలం పనిచేసినం. ఒకప్పుడు కరెంటు సరిగా వచ్చేది కాదు. వస్తే సింగిల్ ఫేస్ వచ్చి బోరు మోటర్లు కాలిపోయినవ్. ఏసిన వరంతా ఎండి పోయి పంట చేతికి రాలేదు. బిడ్డ గీపొలం పనితో మనం బతుకలేం. ఏదైనా పనిచూసుకోమని మాబాపు బీలు నాయక్ చెప్పిండు. ట్రాక్టర్ డ్రైవర్గ జీతానికి చేరిన. తెలంగాణ వచ్చినంక కరెంటు ఫుల్ ఉంటుంది. అసలు పోతనే లేదు. జీతం బంద్ జేసి పొలం జూసుకుంటున్న. 20 గుంటల్ల సన్నవడ్లేస్తే 9 క్వింటాళ్లు వచ్చినయ్. మా అందరి పొలాలకు ఒకటే ట్రాన్స్ఫార్మర్ ఉంటే కేటీఆర్ సార్కు రైతులందరం కలిసి ఇంకోటి ఎయ్యాలని చెప్తే ఎంటనే ఏపిచ్చిండు. మోటర్లు కాలిపోతలేవు. సొంతంగ ట్రాక్టర్ కొనుక్కున్నా. అప్పుడు కూలీచేసినోన్ని ఇప్పుడు ఓనర్నయిన.
శానా సంబురంగా ఉన్నది
తెలంగాణ సర్కారు చేస్తున్న పనులతో రైతులమంతా సంతోషంగా ఉన్నం. సాగు బాధలు తప్పినయ్. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వని పరిస్థితి ఉండె. సీఎం కేసీఆర్ రైతుల కోసం నాణ్యమైన కరెంటు ఇస్తున్నడు. ఆయన కూడా రైతే కాబట్టి మా బాధలన్నీ ఆయనకు తెలుసు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు కేసీఆర్ సార్. రైతులమంతా ఆయనకు రుణపడి ఉంటం.
గత ప్రభుత్వాలు విద్యుత్ శాఖను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు, రైతులకు మేం పూర్తిగా విరోధులుగా అనిపించేవాళ్లం. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి నాణ్యమైన కరెంట్ సరఫరాకు ఏర్పాట్లు చేసింది. రైతులకు ఉచిత విద్యుత్ ప్రారంభించడంతో జిల్లాలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. లో ఓల్టేజీ సమస్యలు, విద్యుత్ కోతలు పూర్తిగా తగ్గాయి. 24 గంటల విద్యుత్ రైతులకు సంపూర్ణంగా అందుతున్నది. ఎప్పుడూ కరెంటు వాళ్లను తిట్టే ప్రజలు, రైతుల్లో విద్యుత్ అధికారులు, సిబ్బందిపై ప్రేమ, గౌరవం పెరిగింది.
రైతాంగానికి ఉచిత విద్యుత్ను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల వరకు ఖర్చు చేసింది. కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేయాలంటే సంస్థను అంతర్గతంగా బలోపేతం చేసేందుకు ఈ మొత్తాన్ని వెచ్చింది. లక్ష్మీపూర్లో 400/200 కేవీ, దుర్శేడులో 220/132 కేవీ, బొమ్మకల్లో 220/66 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
ఇవి కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 132/33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలు 9, 33/11 విద్యుత్తు ఉప కేంద్రాలు 92 ఏర్పాటు చేసింది. విద్యుత్తు లైన్లను బలోపేతం చేసేందుకు కొత్తగా 735 కిలో మీటర్ల వరకు 33/11 కేవీ లైన్లు, 4,100 కిలో మీటర్ల వరకు 11 కేవీ లైన్లు, 12,264 కిలో మీటర్ల వరకు ఎల్టీ లైన్లు, 548 కిలో మీటర్ల వరకు 6.3 కేవీ లైన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్తు వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రూ.49 కోట్లతో మరిన్ని విద్యుత్తు ఉప కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది..
యాతంబోసి సాగు చేసుకున్నం
మాకు ఐదెకరాలుంటే ఒకప్పుడు ఎకరం భూమికి నీళ్లందలే. 9 గంటల కరెంటు కూడా పొద్దంత కొద్దిసేపు, రాత్రి కొద్దిసేపు ఇచ్చేది. అది ఎప్పుడస్తదో ఎప్పుడు పోతదో తెల్వకపోయేది. గీకరెంటు ఇంట్ల మన్నువడనుకుని బాయితవ్వుకుని యాతంబోసి ఎకరం సాగు చేసుకున్నం. రాత్రనక, పొద్దనక అందరం కట్టపడితే 10 గుంటల మడి తడవలే. ఏసిన వరి ఎండిపోయి అప్పుల పాలయినం. పత్తులేసినా చేతికి రాలె. పొలం వద్దని కైకిలి పనికి పోయినం.
కేసీఆర్ సార్ సల్లంగుండ దేవునోలే వచ్చి తెల్లందాక, పొద్దుందాక ఇరాం లేకుంట కరెంటిత్తుండు. మాకే యాట్టత్తుంది. అప్పుడు ఎకరం సాగు చేసినోళ్లం ఇయ్యాళ ఉన్న ఐదెకరాలు దున్ని వరి ఏత్తున్నం. పుట్ల కొద్ది ఇత్తులచ్చినయ్. ఇంకొంచెం భూముంటే మంచిగుండనిపిస్తంది. మేం బతుకుతున్నం. పది మందికి పనికల్పిస్తున్నం.
-గొడుగు బాలవ్వ, జగ్గరావుపల్లి, సిరిసిల్ల అర్బన్ మండలం