చిట్టాపూర్లో పూర్తయిన పదిహేను డబుల్ బెడ్రూం ఇండ్లు
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సమక్షంలో గృహప్రవేశాలు
ఆనందంలో లబ్ధిదారులు
నిరుపేదలకు అండగా : విద్యాసాగర్రావు
మల్లాపూర్, డిసెంబర్ 22 ;పేదల సొంతింటి కల నేరవేరింది. మల్లాపూర్ మండలం చిట్టాపూర్లో 15 డబుల్ బెడ్రూం ఇండ్ల గృహప్రవేశం అట్టహాసంగా సాగింది. బుధవారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభోత్సవం చేశారు. పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు చేయించగా, లబ్ధిదారులు ఆనందంలో మునిగితేలారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు డప్పుచప్పుళ్లు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఇండ్లను ప్రారంభించిన అనంతరం మామిడి తోరణాలు, పూలతో అలంకరించారు. వాకిళ్లలో ముగ్గులు వేసి మురిసిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
పైసా ఖర్చులేకుండా నాకు ఇల్లు
మాది చిట్టాపూర్. నాకు ఇద్దరు బిడ్డలు. నేను ఊళ్లల్లో తిరుగుతూ చేపల అమ్మి, భార్యా ఇద్దరు బిడ్డలను పోషించుకుంటున్న. మాకు కనీసం గుంట జాగలేదు. ఇల్లు లేదు. కిరాయి ఇంట్లో ఉంటున్నం. ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా మాకు టీఆర్ఎస్ సర్కారు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చింది. మేమంతా సీఎం కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటం.
నాది చిట్టాపూర్. నాకు ఇద్దరు బిడ్డలు. నా భార్య అమృత బీడీలు చుడుతది. నేను కూలీ పనికి వెళ్త. ఇద్దరం పనిచేస్తే ఇల్లు గడుస్తది. 30 ఏండ్ల సంది ఊళ్లెనే కిరాయి ఇంట్లో ఉంటున్నం. ఇప్పుడు సీఎం కేసీఆర్ సారు నాకు ఇల్లు ఇచ్చిండు. నా జీవిత కల నెరవేర్చిండు. నాకు ఇల్లు వస్తుందని అస్సలు ఊహించలేదు. బుధవారం విద్యాసాగర్రావు సారు గృహప్రవేశం చేయించిండు. ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు.