గంగాధర, డిసెంబర్ 22: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయులపై శాఖపరమైన చర్యల కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. పాఠశాలలో ప్రిన్సిపాల్ భర్త అజమాయిషీ చేస్తున్నాడని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. తరగతి గదుల్లోకి వెళ్లి చూడగా ఒకే గదిలో రెండు మూడు సెక్షన్ల విద్యార్థులు కూర్చోవడం గమనించి ప్రశ్నించగా ఉపాధ్యాయులు రాలేదని ఎమ్మెల్యేకు తెలిపారు. టీచర్లు జీతాలు తీసుకుంటే సరిపోద్దా, చదువు చెప్పనవసరం లేదా, విద్యార్థుల చదువులను గాలికొదిలేస్తారా అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. బుధవారం మటన్తో భోజనం వడ్డిస్తున్నట్లు నిర్వాహకులు తెలుపగా, ఎంత మోతాదులో పెడుతున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించగా సిబ్బంది పొంతనలేని సమధానాలు చెప్పడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు తన ఫోన్ నంబర్ ఇచ్చి సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తరగతి గదిలో బ్లాక్బోర్డుపై తన ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించడానికి సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. అధికారులు, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతున్నదదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో బెంచీలు లేక కింద కూర్చోవడం ఇబ్బందిగా ఉందని విద్యార్థులు తెలుపగా ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ పుల్కం నర్సయ్య, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, సర్పంచ్ మడ్లపెల్లి గంగాధర్, నాయకులు అంజి, జారతి సత్తయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కార్యకర్తలే టీఆర్ఎస్కు బలం
కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి కొండంత బలం అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకుడు రేండ్ల శ్రీనివాస్ పుట్టిన రోజును పురస్కరించుకొని మండల కేంద్రంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, మేచినేని నవీన్రావు, వేముల దామోదర్, శ్రీమల్ల మేఘరాజు, ఎండీ నజీర్, ముక్కెర మల్లేశం, జోగు లక్ష్మిరాజం, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్రెడ్డి, ఉపసర్పంచ్ నిమ్మనవేణి ప్రభాకర్, నాయకులు ఆకుల మధుసూదన్, రామిడి సురేందర్, శంకర్గౌడ్ తదితరులు ఉన్నారు.