భగత్నగర్ రిజర్వాయర్ పరిధిలో నీటి ప్రెషర్ పెంచుతాం
నగర మేయర్ వై సునీల్రావు
కార్పొరేషన్, డిసెంబర్ 22: నగర ప్రజలకు రాబోయే రోజుల్లో 24 గంటలు మంచి నీటిని సరఫరా చేస్తామని మేయర్ వై సునీల్రావు తెలిపారు. భగత్నగర్ రిజర్వాయర్ పరిధిలో మంచినీటి సరఫరాలో ప్రెషర్ పెంచేందుకు వీలుగా కొత్తగా నిర్మించిన సంపును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలోని భగత్నగర్, రాంనగర్, హౌసింగ్బోర్డు కాలనీ రిజర్వాయర్ల పరిధిలో పైలెట్ ప్రాజెక్ట్ కింద 24 గంటలు మంచినీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత జూలై నుంచి నగరంలో రోజూ నీటి సరఫరా దిగ్విజయంగా కొనసాగుతోందన్నారు. భగత్నగర్, అంబేద్కర్నగర్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో తగినంత ప్రెషర్ రావడం లేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని సంపులు నిర్మించినట్లు పేర్కొన్నారు. భగత్నగర్ రిజర్వాయర్ పరిధిలోని 33, 34, 35, 52, 53వ డివిజన్ల ప్రజలకు మంచినీటిని సరఫరా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం భగత్నగర్ సంపుతో పాటు ట్యాంక్ను పూర్తి స్థాయిలో వినియోగించి ప్రెషర్తో నీటిని సరఫరా చేస్తామని వెల్లడించారు. త్వరలోనే అంబేద్కర్నగర్ రిజర్వాయర్లోని సంపును కూడా ప్రారంభిస్తామని తెలిపారు. దీనికి అదనంగా రాబోయే రోజుల్లో రూ.18 కోట్లతో 24 గంటలు నల్లా నీరు వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద నగరంలోని 3 రిజర్వాయర్లను ఎంపిక చేశామని, వీటికి సంబంధించి టెండర్లు కూడా పూర్తయినట్లు తెలిపారు. త్వరలోనే ఈ పనులను ప్రారంభించి ఏడు నెలల్లో పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. మంచినీటి సరఫరా, పారిశుధ్యం విషయంలో నగరపాలక సంస్థ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం నిర్వహించిన సఫాయి మిత్ర సురక్షా చాలెంజ్లో కరీంనగర్ 2వ స్థానంలో నిలిచి రూ.4 కోట్ల బహుమతి సాధించిందన్నారు. ఈ నిధులను పారిశుధ్య పనుల కోసం అధునాతన యంత్రాలను కొనుగోలు చేస్తామని తెలిపారు. అనంతరం గోదాంగడ్డలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, శ్రీదేవి- చంద్రమౌళి, షాకీరా అంజూమ్ బరత్ అలీ, ఇఫ్రా తహరీన్ అథీనా, ఏఈలు గంగాధర్, గట్టు స్వామి తదితరులు పాల్గొన్నారు.