క్రైస్తవుల అభ్యున్నతికి సర్కారు కృషి
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
క్రిస్మస్ కానుకల పంపిణీ
గంగాధర, డిసెంబర్ 22: రాష్ట్రంలో సర్వ మతాలకు సముచిత గౌరవం దక్కుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. క్రిస్మస్ను పురస్కరించుకొని మండలంలోని మధురానగర్లో బుధవారం ఆయన ప్రభుత్వం తరఫున క్రైస్తవులకు కానుకలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలకు సముచిత గౌరవం ఇస్తున్నారని తెలిపారు. పండుగలకు నిధులు కేటాయించి అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహకం అందజేస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల జీవనోపాధి కోసం సబ్సిడీ రుణాలు ఇవ్వడంతో పాటు వాహనాలు అందజేస్తోందన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించడానికి మైనారిటీ గురుకులాలను సర్కారు ప్రారంభించిందన్నారు. క్రైస్తవులు పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కానుకలు అందజేయడంతో పాటు విందు భోజనం ఏర్పాటు చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు మతసామరస్యాన్ని పాటించి అన్నదమ్ముల్లా కలిసి జీవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవులు పాల్గొన్నారు.