హుజూరాబాద్, అక్టోబర్ 22:బీజేపీ నేతలు చేసేది చెప్పకుండా అన్నీ అట్టి ముచ్చట్లే పెడుతున్నరు. వట్టి మాటలతో కడుపు నిండుతదా..? ఈటల కాయ కొరుకుడు మాటలతో అయ్యేది లేదు.. పోయేది లేదు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉండే ఏం చేయలేదు..? ఇప్పుడేం ఒరుగబెడుతడు. గ్యాస్ రేట్ల మీద సవాల్ విసిరితేనే ఇంకా స్పందించలేదు. ఆయనతో ఏం కాదు. బీజేపోళ్లు రోజుకో కుట్ర పన్నుతున్నరు..? ఢిల్లీలో బలముందని కేంద్ర బలగాలను దించి ప్రజలను భయపెట్టాలని చూస్తున్నరు..? అట్ల చేస్తే ఓట్లు పడుతయా..? హుజూరాబాద్లో ఎవరేం చేసినా.. ఎన్ని ఎత్తులు వేసినా గెలిచేది టీఆర్ఎస్సే. ప్రజలంతా మా వెంటే ఉన్నరు. గెల్లును భారీ మెజార్టీతో గెలిపించండి.. హుజూరాబాద్ రూపురేఖలు మారుస్త. 15 రోజులకోసారి ఇక్కడికి వచ్చి దగ్గరుండీ మరీ పనులు చేయిస్త.
‘టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను ఆశీర్వదించండి. భారీ మెజార్టీతో గెలిపించండి. హుజూరాబాద్ రూపురేఖలు మారుస్త’ అని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు హామీ ఇచ్చారు. శుక్రవారం హుజూరాబాద్ పట్టణంలోని సూపర్బజార్ రోడ్డులో నిర్వహించిన ధూంధాం దుమ్ము రేపింది. కళాకారుల ఆటా.. పాటలు ఉర్రూతలూగించాయి. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. ఏడేండ్లు మంత్రిగా ఉన్న రాజేందర్ పట్టణ అభివృద్ధిని పూర్తిగా మరిచిపోయిండని, సొంత లాభమే చూసుకున్నాడని మండిపడ్డారు. హుజూరాబాద్ పట్టణ అభివృద్ధిని రూ.60కోట్లతో బ్రహ్మాండంగా చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని పనులు పూర్తి కాగా, మరికొన్ని కొనసాగుతున్నాయన్నారు. సూపర్బజార్ రోడ్డు సూపర్గా మారడం తమ పనితనానికి నిదర్శనమన్నారు. నాలుగు నెలల నుంచి మంత్రి గంగుల తాను ఇక్కడే ఉండి చెప్పిన పనులు చేసి చూపెడుతున్నామన్నారు.
చేతనైతే ధరలు తగ్గించి మాట్లాడాలె..
కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో సహా మరి కొంత మంది బీజేపీ నేతలు ఇక్కడికి వచ్చి అక్కరకు రాని ముచ్చట్లు చెబుతున్నారని, చేతనైతే ప్రధానితో మాట్లాడి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ఓట్లు అడుగాలని డిమాండ్ చేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో ఈటల ముచ్చట్లు కూడా అట్లనే ఉంటయని దుయ్యబట్టారు. గ్యాస్ ధరపై సవాల్ విసిరితే ఇప్పటికీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తాము మాటలు చెప్పేటోళ్లం కాదని, పనులు చేసి చూపెటోళ్లమని స్పష్టం చేశారు. గెల్లును గెలిపిస్తే త్వరలోనే హుజూరాబాద్ మోడల్ చెరువును సుందరంగా తీర్చిదిద్దుతామని, మినీస్టేడియాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజలంతా టీఆర్ఎస్ వెంటే..
బీజేపీ నేతలు రోజుకో కుట్ర పన్నుతున్నారని, కేంద్ర బలగాలను దించి ఓటర్లను భయపెట్టాలని చూస్తున్నారని మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. అలా చేస్తే ఓట్లు పడవని, ప్రజల మనసును గెలిస్తేనే ఓట్లు పడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉంటారని, గెలిచేది కారు మాత్రమే అని గుర్తు పెట్టుకోవాలన్నారు. గెల్లును గెలిపిస్తే తాను 15 రోజులకోసారి వచ్చి దగ్గరుండీ మరీ పనులు చేయిస్తానని చెప్పారు.
ఈటలకు పేదలంటే పట్టదు.. ప్రగతి గిట్టదు
మీరు ఇన్నేండ్లు టీఆర్ఎస్ను నమ్మి ఈటల రాజేందర్ను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన్రు. రెండుసార్లు మంత్రిగా అవకాశం ఇప్పించిన్రు. కానీ ఆయన ఏం చేసిండు. సొంతలాభం చూసుకున్నడు. పేదలంటే పట్టదు.. అభివృద్ధి అంటే గిట్టదు. పేదల కోసం నాలుగువేల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తే ఒక్కటైనా కట్టిండా..? అలాంటి వ్యక్తికి ఓటెందుకు వేయాలి. ఎదుటోళ్లు ఎదుగుతుంటే ఓర్వని గుణం రాజేందర్ది. అటువంటి వ్యక్తిని ఎన్నికల్లో ఓడించాలి. నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మీ ఇంటి ముందటికే వచ్చి పనులు చేస్తా. నేను ఉద్యమం చేసిన. 120 కేసులపాలైన. పోలీసోళ్లు నా మట్టల మీద, ఒల్లు వాసేతట్టు ఎంత కొట్టినా ఉద్యమాన్ని వీడలే. చంచల్గూడ, చర్లపల్లి జైళ్లకు పంపించినా మళ్లీ వచ్చి ఉద్యమం చేసిన. రాష్ట్రం సిద్దించే దాక ముందుండి పోరాడిన. ఒక్కసారి ఆశీర్వదించండి. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా. కొడుకు లెక్క మంచి చేడు చూసుకుంట.