రాష్ట్రవ్యాప్తంగా పథకం అమలు
తొలుత ప్రతి నియోజకవర్గంలో 100 మందికి వర్తింపు
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
కరీంనగర్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
కరీంనగర్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘దళితబంధు’ సత్ఫలితాలిస్తున్నదని, ఇక్కడి దళితులు అభివృద్ధి బాటలో పయనిస్తున్నారని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిపారు. దళితబంధు అమలుపై శనివారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎం కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా, మేడ్చల్ మలాజిగిరి జిల్లా నుంచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 118 నియోజకవర్గాల్లో మొదటిదశలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి పథకం అమలు చేస్తామన్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు సమావేశాలు పెట్టుకొని ఫిబ్రవరి 5 లోగా అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి అందించాలని సూచించారు. మార్చి నెల 7వ తేదీలోగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, నిధులకు కొరత లేదని స్పష్టం చేశారు. ళితబంధు పథకం అమలుకు శనివారం (నేడు) రూ. 100 కోట్లు విడుదలయ్యాయని, మరో రెండు మూడు రోజుల్లో రూ.1200 కోట్లు విడుదల చేసి అన్ని జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ఆగస్టు 16న శాలపల్లి ఇందిరానగర్లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకం దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. వీసీలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు జీ రవి, సంగీత సత్యనారాయణ, అనురాగ్ జయంతి మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని సకాలంలో లబ్ధిదారుల లిస్ట్ తయారు చేస్తామని, యూనిట్లు గ్రౌండ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా చోట్ల జగిత్యాల, పెద్దపల్లి అదనపు కలెక్టర్లు వినోద్ కుమార్, వీ లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, ఆర్డీవో మాధురి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు లక్ష్మీనారాయణ, రాజేశ్వరీ, వినోద్కుమార్, పెద్దపల్లి జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి నాగలైశ్వర్, జగిత్యాల జడ్పీ సీఈవో సుందరవరదరాజన్, పెద్దపల్లి జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు, సిరిసిల్ల డీఆర్డీవో కౌటిల్య రెడ్డి, డీఏవో రణధీర్కుమార్, సీపీవో శ్రీనివాస చారి పాల్గొన్నారు.