కొత్తగా రేణికుంట వద్ద ఏర్పాటుకు ప్రతిపాదన
ఆదాయం పెంపుపై మార్కెటింగ్ శాఖ ప్రత్యేక దృష్టి
ముకరంపుర, జనవరి 22: సాగు చట్టాల రద్దు నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కార్యకలాపాలు తిరిగి యథావిధిగా మొదలయ్యాయి. మార్కెట్ ఫీజు వసూళ్ల విషయంలో కొద్ది రోజులుగా నెలకొన్న అనిశ్చితి తొలగడంతో యార్డులు తిరిగి కొత్త శోభను సంతరించుకొనున్నాయి. ఇకపై మార్కెట్ ఫీజు లక్ష్యాన్ని సాధించి, ఆదాయాన్ని పెంచుకునే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటి వరకు తగినంత ఆదాయం లేక డీలా పడిన కమిటీల ఖజనా ఇక కళకళలాడనుంది. మార్కెట్ కమిటీలు కూడా పూర్వ వైభవాన్ని సంతరించుకోనున్నాయి. ప్రధానంగా వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసే సరుకు విలువపై చెక్పోస్టుల వద్ద సిబ్బంది ఒక శాతం మార్కెట్ ఫీజు వసూలు చేస్తుంటారు. ఇవే మార్కెట్లకు ప్రధాన ఆదాయ వనరు. మార్కెట్ కమిటీల పరిధిలోని ప్రధాన రహదారుల్లో చెక్పోస్టు కేంద్రాలున్నాయి. ప్రస్తుతం వీటిని తిరిగి ఎప్పటిలాగే నిర్వహించేందుకు మార్కెటింగ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
కొత్తగా రేణికుంట వద్ద ప్రతిపాదన
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో ప్రస్తుతం ఎనిమిది చెక్ పోస్టులు ఉన్నాయి. కరీంనగర్ మార్కెట్ కమిటీ పరిధిలో బైపాస్లో, తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ వద్ద, జమ్మికుంట మార్కెట్కు హుజూరాబాద్ రోడ్డులో చెక్పోస్టు ఉంది. హుజూరాబాద్ మార్కెట్కు సంబంధించి ఎల్కతుర్తి వద్ద, గంగాధర మార్కెట్ పరిధిలో గంగాధర ఎక్స్ రోడ్డులో, మానకొండూర్ మార్కెట్ కమిటీకి మానకొండూర్ ప్రధాన రహదారిపై చెక్పోస్టు ఉంది. గోపాల్రావుపేట మార్కెట్కు గోపాల్రావుపేట, వెలిచాల ఎక్స్రోడ్డు వద్ద చెక్పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సంబంధించి మార్కెట్ ఫీజు వసూళ్లు తిరిగి మొదలయ్యాయి. గతంలో కంటే మరింత కట్టుదిట్టంగా నిరంతరం నిఘా ఉండేలా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలతో పాటు రుసుం వసూళ్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు. కాగా, రేణికుంట వద్ద కొత్త చెక్పోస్టు ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు సమాచారం. గతంలో బెజ్జంకి మార్కెట్ కరీంనగర్ పరిధిలోనే ఉండేది. జిల్లాల విభజనతో బెజ్జంకి సిద్దిపేట జిల్లాలోకి వెళ్లడంతో మార్కెట్ పరిధి కూడా మారింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులపై రుసుం వసూలు చేసేలా రేణికుంట వద్ద శాశ్వత ప్రాతిపదికన చెక్పోస్టు ఏర్పాటైతే ఆదాయం మరింతగా పెరగనుంది.
గతేడాది రూ.88.94 లక్షల ఆదాయం
వ్యవసాయ మార్కెట్ల చెక్పోస్టుల ద్వారా గతేడాది మార్కెట్ కమిటీలకు రూ.88.94 లక్షల ఆదాయం సమకూరింది. ఇందులో అత్యధికంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పరిధిలోని హుజూరాబాద్రోడ్ చెక్పోస్టు నుంచి రూ.39.91 లక్షలు, హుజూరాబాద్ మార్కెట్కు ఎల్కతుర్తి చెక్పోస్టులో రూ.22.35 లక్షల రుసుం వసూలైంది. ఆ తర్వాత గంగాధర మార్కెట్కు ఎక్స్రోడ్డులోని చెక్పోస్టు ద్వారా రూ.11.90 లక్షల ఆదాయం వచ్చింది. మానకొండూర్కు స్థానికంగా ఉన్న చెక్పోస్టు నుంచి రూ.1.38 లక్షలు, గోపాల్రావుపేట్ మార్కెట్కు ఉన్న రెండు చెక్పోస్టులైన గోపాల్రావుపేట, వెలిచాల ఎక్స్రోడ్ నుంచి రూ.3.68 లక్షల రుసుం సమకూరింది. అయితే ఆదాయం అధికంగా వచ్చే చెక్పోస్టులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేలా చర్యలు చేపట్టారు.
చెక్పోస్టులపై నిరంతర పర్యవేక్షణ
చెక్పోస్టులు తిరిగి ప్రారంభమైనందున వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సంబంధించి కేంద్రాల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. రుసుం వసూళ్లపై నిఘాను మరింత కట్టుదిట్టం చేశాం. మార్కెటింగ్ శాఖ ఆదాయాన్ని పెంచే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నం.