వెలిచాలలో రెండో రోజూ కొనసాగిన మృత్యుంజయ హోమం
ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ సరోజన-ప్రభాకర్రావు దంపతులు
రామడుగు, జనవరి 22: మండలంలోని వెలిచాల గ్రామంలో సర్పంచ్ వీర్ల సరోజన-ప్రభాకర్రావు దంపతుల ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన శతచండీ యాగం శనివారం రెండో రోజూ కనుల పండువగా కొనసాగింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ యాగశాలలో దేవతామూర్తులను పూలతో అందంగా అలంకరించారు. శృంగేరి వేద పండితులు గోపీకృష్ణ శర్మ, ఫణి శశంక్శర్మతో పాటు 25 మంది రిత్వికులతో నిర్వహిస్తున్న శతచండీ యాగంలో భాగంగా శనివారం ఉదయం గురుప్రార్థన, గణపతి పూజతో ప్రారంభించారు. అనంతరం గోపూజ నిర్వహించారు. చండీ సప్తశతి పారాయణం, మూలమంత్ర జపం, మృత్యుంజయ హోమం జరిపించారు. ఈ సందర్భంగా ప్రధాన యాజ్ఞికులు మాట్లాడుతూ, వెలిచాల గ్రామంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతో, ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని, ఆపదలు తొలగిపోయి విజయాలు సాధించాలనే లక్ష్యంతో శతచండీ యాగం చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. కాగా, మూడోరోజు ఆదివారం ముప్పై శతి పారాయణాలు, మూలమంత్రం, నవగ్రహ హోమం, తదితర పూజలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. పూజల్లో సర్పంచ్ వీర్ల సరోజన-ప్రభాకర్రావు దంపతులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు-కవిత దంపతులు, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్రావు, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.