జిల్లాలో రెండో డోస్ వ్యాక్సిన్ 98 శాతం పూర్తి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
విద్యానగర్, జనవరి 22: జిల్లాలో ఈనెల 26వ తేదీలోగా రెండో డోస్ కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులకు లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. శనివారం సాయంత్రం ఆమె మెడికల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో కొవిడ్ వ్యాక్సినేషన్, ఇంటింటా జ్వర సర్వేపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కొవిడ్ రెండో డోస్ వ్యాక్సినేషన్ 98 శాతం పూర్తయిందని, 20 వేల మంది ఓవర్ డ్యూ ఉన్నారని, వారందరికీ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించి రెండు రోజుల్లో వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదివారం అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ప్రతి ఏఎన్ఎం రోజుకు 100 వ్యాక్సిన్లు వేసేలా టార్గెట్ నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో ఇంటింటా జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి హోం ఐసొలేషన్ కిట్లు అందజేయాలని ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితిని రోజు పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో హోం ఐసొలేషన్ కిట్లకు కొరత లేదని తెలిపారు. డీఎంహెచ్వో డాక్టర్ జువేరియా, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, మెడికల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.