ఇన్నేండ్లలో ఏ ఒక్క సామాజిక వర్గానికైనా భరోసా కల్పించారా..?
అభివృద్ధిని ఓర్వలేకనే సీఎంపై బీజేపీ నేతల విమర్శలు
రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ప్రధాని మోదీ తీరుపై ధ్వజం
న్యూ కొత్తపల్లి, నర్సింగాపూర్లో పర్యటన
రూ.60.60 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
న్యూ కొత్తపల్లిలో హాజరైన జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
ధర్మారం, జనవరి22: నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర సర్కారుతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఇన్నేండ్ల పాలనలో ఏ ఒక్క సామాజిక వర్గానికైనా భరోసా కల్పించలేదని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం న్యూ కొత్తపల్లి, నర్సింగాపూర్లో పర్యటించారు. ఆయాచోట్ల సుమారు రూ.60.60 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం న్యూ కొత్తపల్లిలో నూతనంగా నిర్మించిన జీపీ కార్యాలయ భవనాన్ని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్తో కలిసి ప్రారంభించారు. తర్వాత గ్రామంలో 42 మందికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లు అందజేశారు. అనంతరం నర్సింగాపూర్లో పర్యటించి వైకుంఠధామం, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. నర్సింగాపూర్లో 47 మందికి రూ.47,05, 452 విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి ఈశ్వర్.. ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వంతో ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వ పాలన తీరుపై అసంతృప్తిగా ఉన్నారని దుయ్యబట్టారు. కనీసం రైతులకైనా మేలు చేశారా..? నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేశారా..? ఆఖరికి రైతులు పండించిన దొడ్డు వడ్లను కొనుగోలు చేస్తామని అభయమైనా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. ఇలా ప్రజలకు ఏ మేలు చేయకుండా.. సంక్షేమాన్ని పట్టకుండా కేంద్రం వ్యవహరిస్తుంటే.. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్పై రాష్ట్ర తమ ఉనికి కోసం బీజేపీ నాయకులు అనవసర విమర్శలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు.
ఆ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రైతులు పండించిన దొడ్డు వడ్లు కొనుగోలు చేయించాలని సూచించారు. దొడ్డు వడ్ల కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్రాలు ఏర్పాటు చేసి మధ్యవర్తిత్వం మాత్రమే చేస్తుందనే విషయాన్ని రైతులు గమనించాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఏడేండ్ల పాలన ఎంతో అద్భుతంగా జరిగిందని, అదే స్ఫూర్తితో పాలన కొనసాగుతుందని ఉద్ఘాటించారు. ముఖ్యంగా రైతు సంక్షేమానికి దేశంలో మరెక్కడా లేనివిధంగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. న్యూ కొత్తపల్లి సమావేశంలో జడ్పీ చైర్మన్ మధూకర్ మాట్లాడుతూ, మంత్రి ఈశ్వర్ కృషితో గ్రామాలు అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు. ఈ గ్రామంలో జీపీ కార్యాలయ భవనం నిర్మాణం మంత్రి కృషితోనే జరిగిందని చెప్పారు. ఆయా కార్యక్రమాలకు సర్పంచులు దార మల్లమ్మ, సురకంటి శ్రీనివాస్ రెడ్డి వేర్వేరుగా అధ్యక్షత వహించగా, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ఎంపీటీసీలు సూరమల్ల శ్రీనివాస్, బద్దం అజయ్పాల్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లు, ఎంపీడీవో జయశీల, తాసిల్దార్ వెంకట్ లక్ష్మీ, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రాజేశ్వరి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ సలామొద్దీన్ పాల్గొన్నారు.