వైద్యులు బీఎన్ రావు, విజయలక్ష్మికి అవార్డులు ప్రకటించిన ఐఎంఏ
సామాజిక సేవ, ఉచిత వైద్యానికి దక్కిన గౌరవం
27, 28వ తేదీల్లో పాట్నాలో ప్రదానం
సామాజిక సేవలో బీఎన్రావు..
డాక్టర్ బీఎన్రావు తన పేరిట స్థాపించిన బీఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ ద్వారా కొన్నేళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 30వేల మంది విద్యార్థులకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి 7వేల మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరికి ఐరన్ మాత్రలతో పాటు బెల్లం పట్టీలు, పండ్లు మూడు నెలల పాటు ఉచితంగా పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని రెండు విడుతలుగా చేపట్టారు. వీటితో పాటు కరోనా సమయంలో మున్సిపల్, పారా మెడికల్, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్స్, శానిటైజర్లు, మాస్క్లు, ప్రభుత్వ దవాఖానకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఉచితంగా అందజేసినందుకుగాను బీఎన్ రావుకు వ్యక్తిగతంగా బెస్ట్ కమ్యూనిటీ సర్వీస్ కింద జాతీయ అవార్డు దక్కింది.
కరీంనగర్ వైద్యులకు అరుదైన గౌరవం దక్కింది. పేదలకు చేస్తున్న సామాజిక సేవ, ఉచిత వైద్యానికి గుర్తింపుగా వైద్యులు బీఎన్ రావు, విజయలక్ష్మికి జాతీయ పురస్కారం వరించింది. ఈ నెల 27, 28వ తేదీల్లో బీహార్లోని పాట్నాలో అవార్డులు అందుకోనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
పేదల పెన్నిధి విజయలక్ష్మి
రోగులతో అమ్మా అని పిలిపించుకునే సీనియర్ గైనకాలజిస్ట్, సంజీవని నర్సింగ్ హోం నిర్వాహకురాలు డాక్టర్ విజయలక్ష్మి నిర్వహించిన అనేక సామాజిక కార్యక్రమాలకుగాను జాతీయ స్థాయిలో బెస్ట్ సోషల్ ఆక్టివిటీ అవార్డు దక్కింది. విజయలక్ష్మి పేద రోగులకు ఉచితంగా చికిత్సలు అందించడమే కాకుండా ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు ప్రతినెలా అర్బన్ హెల్త్ సెంటర్లలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, మందులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 5 వేల మందికి పైగా గర్భిణులకు ఉచితంగా మందులతో పాటు చికిత్సలు అందించారు. ఎన్నోసార్లు ప్రభుత్వం నుంచి ఉత్తమ వైద్యురాలిగా అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఐఎంఏ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్న డాక్టర్ విజయలక్ష్మికి జాతీయ స్థాయి అవార్డు దక్కడం విశేషం. ఒకేసారి ఇద్దరు సీనియర్ వైద్యులకు జాతీయ స్థాయి అవార్డులు రావడంపై జిల్లాలోని సీనియర్ వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారికి అభినందనలు తెలుపుతున్నారు.