గన్నేరువరం, డిసెంబర్ 21: మండలంలోని గునుకులకొండాపూర్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ కరోనా వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తిస్తున్నారు. మంగళవారం గ్రామంలో కరోనా రెండో డోస్ వేసుకోని 30 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఏఎన్ఎం సుజాత తెలిపారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తప్పకుండా వేసుకోవాలని, కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు మంగ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న నిర్ధారణ పరీక్షలు
మానకొండూర్ రూరల్, డిసెంబర్ 21: లక్ష్మీపూర్ (వెల్ది) పీహెచ్సీ పరిధిలో డాక్టర్ బియాబాని ఆధ్వర్యంలో మంగళవారం 83 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. లక్ష్మీపూర్, వెల్ది, ఊటూర్, పచ్చునూర్, వేగురుపల్లి, కేల్లేడు, మద్దికుంట, రంగపేట, లింగాపూర్ గ్రామాల్లో 413 మందికి వాక్సిన్ వేశారు. అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. ఇక్కడ హెల్త్ సూపర్వైజర్లు అన్నపూర్ణ, ఎండీ జుబేర్, కంప్యూటర్ ఆపరేటర్ ఎండీ ఇజాజ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.