అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు
మేయర్ వై సునీల్రావు
డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ
కార్పొరేషన్, డిసెంబర్ 21: నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతున్నట్లు మేయర్ వై సునీల్రావు తెలిపారు. భగత్నగర్లోని బాలరక్షా భవన్ వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులకు మంగళవారం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం 33వ డివిజన్లో కొనసాగుతున్న స్మార్ట్సిటీ పనులను పరిశీలించారు. డివిజన్లో శిథిలమైన డ్రైనేజీల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పలు చోట్ల అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యలోనే వదిలేయడంతో మురుగు నీరంతా నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారని, వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మేయర్ వై సునీల్రావు మాట్లాడుతూ, నగర ప్రజలకు పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించేందుకే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. భగత్నగర్లో కొనసాగుతున్న స్మార్ట్సిటీ రోడ్లు, డ్రైనేజీ, ఫుట్పాత్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలన్నారు. నగరంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని 24 ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నగర వ్యాప్తంగా త్వరలోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
జడ్పీ వాటర్ ట్యాంక్ పరిశీలన
భగత్నగర్లోని భగత్సింగ్ చౌరస్తా నుంచి గోదాంగడ్డకు వెళ్లే రోడ్డుకు అడ్డుగా ఉన్న జడ్పీ క్వార్టర్స్ వాటర్ ట్యాంక్ను తొలగించేందుకు మేయర్ వై సునీల్రావు మంగళవారం జడ్పీ చైర్పర్సన్ విజయతో కలిసి పరిశీలించారు. ట్యాంక్ రోడ్డు మధ్యలో ఉండడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ట్యాంక్ను తొలగించి క్వార్టర్స్లోని ఖాళీ స్థలంలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఈఈ రామన్, డీఈ మసూద్ అలీ, ఏఈ గంగాధర్, స్మార్ట్సిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.