ఓదెల, డిసెంబర్ 21: జిల్లాలో చలి వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం గజగజలాడుతున్నారు. వారం రోజులు ఉమ్మడి జిల్లాలో 14 నుంచి 16 డిగ్రీల మధ్య నమోదవుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు మంగళవారం ఒక్కసారిగా పది డిగ్రీలకు చేరింది. దీంతో జిల్లాలో ఉదయం బయటకు వేళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. గత పదిహేను రోజులు జిల్లాలో చలి తీవ్రత సాధారణంగానే కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలు దాటి చలి తన ప్రభావాన్ని చూపుతుంది. ఉదయం 9 గంటల వరకు కూడా చలి తగ్గడం లేదు. ముఖ్యంగా ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో 9 గంటల వరకు కూడా చలి తీవ్రంగానే ఉంటుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చలి తన ప్రతాపాన్ని చూపుతుంది. రాత్రి, ఉదయం పూట చలి ఎక్కువగా ఉంటుండడంతో ప్రజలు ఉన్ని దుస్తులు ఉంటే కానీ బయటకు రాని పరిస్థితి నెలకొన్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదవుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాగా, అటవీ ప్రాంతమైన మంథని నియోజకవర్గం, జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతా ల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 9 డిగ్రీ ల కనిష్ట ఉష్ణోగత్ర నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.