అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
అల్ఫోర్స్లో అట్టహాసంగా గణిత్ ఫెస్ట్
హాజరైన పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారధి
కమాన్చౌరస్తా, డిసెంబర్ 21: పోటీ పరీక్షల్లో విజయానికి గణితమే కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. విద్యార్థులు ఈ సబ్జెక్టుపై పట్టు సాధించేందుకు కఠోర సాధన చేయాలని సూచించారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ – టెక్నోలో అట్టహాసంగా నిర్వహించిన ‘అల్ఫోర్స్ గణిత్ ఫెస్ట్’ను మంగళవారం ఆమె పద్మశ్రీ అవార్డ్ గ్రహీత శ్రీ భాష్యం విజయసారధి, అల్ఫోర్స్ చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తాను ఎన్నో విద్యాసంస్థల్లో నిర్వహించిన అనేక కార్యక్రమాలకు హాజరయ్యాయని, కానీ ఈ రోజు గణిత్ ఫెస్ట్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. తనకు మ్యాథ్స్ ఇష్టమైన సబ్జెక్ట్ అని చెప్పారు. గణితంపై పట్టు సాధించే ఐఏఎస్కు ఎంపికకావడం గర్వకారణంగా ఉన్నదన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, మహామహోపాధ్యాయ శ్రీభాష్యం విజయసారధి మాట్లాడుతూ, విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే తల్లిదండ్రులు నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించి లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. శ్రీనివాస రామానుజన్ మహోన్నతమైన గణిత మేధావని, ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ప్రస్తుతించారు. అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రముఖుల సమక్షంలో వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉన్నదన్నారు. భారత దేశ గణిత పితామహుడిగా ఖ్యాతి గడించిన రామానుజన్ గారిని స్మరించుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. అనంతరం ఈ నెల 12న నిర్వహించిన అల్ఫోర్స్ గణిత పరీక్షలో గెలుపొందిన విద్యార్థులకు నగదు పారితోషికాలు, ప్ర శంసా పత్రాలను అందజేసి ఘనంగా సన్మానించారు. గణిత శాస్త్రం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న గణిత ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత నరేందర్రెడ్డిని సైతం గణిత ఉపాధ్యాయులు సత్కరించారు. కాగా, ఈ వేడుక ల్లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.