డెయిరీ యూనిట్లకు ప్రాధాన్యం
ఇద్దరు లేదా ముగ్గురు కలిసి యూనిట్లు పెట్టుకోవచ్చు
ఊరూరా అవగాహన, శిక్షణ
కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్
కరీంనగర్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పథకం అమలుపై క్లస్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితబంధులో డెయిరీ యూనిట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, ఇంతకుముందు పెట్టుకున్న యూనిట్లలో ఏమైనా మార్పులు ఉంటే సరి చేసుకోవచ్చని సూచించారు. పదిమంది ఒక బృందంగా యూనిట్లను స్థాపించుకునే వీలున్నదన్నారు. 20 మంది ఒక బృందంగా ఏర్పడి సొసైటీని ఏర్పాటు చేసుకొని మినీ డెయిరీ యూనిట్ల్ల స్థాపనకు ముందుకు వచ్చారని తెలిపారు. లబ్ధిదారులకు గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తదనంతరం కరీంనగర్, హైదరాబాద్లో శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ స్కీంను ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు తమ యూనిట్లను రాష్ట్రంలో ఎకడైనా పెట్టుకునే వీలుందని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని హుజూరాబాద్లో కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్, డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, డీఆర్డీవో శ్రీలత తదితరులు ఉన్నారు.