ఇసుకాసురుల కొత్త ఎత్తుగడలు
రీచ్ నుంచి ఒక ట్రిప్పు.. వాగు నుంచి మరో ట్రిప్పు తరలింపు
సర్కారు ఆదాయానికి గండికొడుతున్న అక్రమార్కులు
గుట్టు రట్టు చేసిన కేశవపట్నం పోలీసులు
శంకరపట్నం, డిసెంబర్ 21: ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సర్కారు తెచ్చిన నిబంధనలను కొందరు ఇసుకాసురులు ఉల్లంఘిస్తున్నారు. కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుకను తరలించేందుకు ఆన్లైన్లో బుక్ చేసుకొని అదనంగా మరో ట్రిప్పు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరి అక్రమ వ్యవహారాన్ని కేశవపట్నం పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్ఐ ప్రశాంత్రావు తెలిపిన వివరాల ప్రకారం.. కేశవపట్నం మండలం మొలంగూర్ శివారులో మంగళవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన ఊటూరి కిరణ్, గుర్రం రాజు రెండు ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ పోలీసులకు కనిపించారు. ట్రాక్టర్లను ఆపి తనిఖీ చేయగా మంగళవారం ఉదయం 9గంటలకు ఇసుక బుక్ చేసినట్లు పత్రాలున్నాయి. అయితే 10-30 గంటలకు మొలంగూర్కు రావడంతో పోలీసులకు అనుమానం వచ్చి సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. రెండు ట్రాక్టర్లలో ఇసుకను రీచ్ నుంచి కాకుండా దొంగచాటుగా వాగు నుంచి తరలిస్తున్నట్లు తేలింది. సాధారణంగా ఇసుకను బుక్ చేసుకున్న ట్రాక్టర్ యజమానులు కేటాయించిన రీచ్కు వెళ్లి ఇసుకను నింపుకొని ఎస్ఆర్ ద్వారా ఆన్లైన్ చేసిన తర్వాత వినియోగదారులకు అందించాలి. కానీ.. ఇసుక అక్రమార్కులు మాత్రం ఎలాగూ తమ ట్రాక్టర్లకు ఇసుక అనుమతి వస్తుందని ముందే భావించి రాత్రి పూట ముందుగానే ట్రాక్టర్లలో ఇసుక నింపుకొని రెడీగా ఉంటారు. తమ ట్రాక్టర్కు ఇసుక అలాట్ అయినట్లు మెసేజ్ రాగానే రీచ్తో సంబంధం లేకుండా ఇతరులకు అధిక ధరకు అమ్ముతున్నారు. వెంటనే తిరిగి రీచ్కు వెళ్లి వారికి బుక్ అయిన ఇసుకను నింపుకొని కస్టమర్లకు సరఫరా చేస్తున్నారని తేలిందని, దీంతో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.