ఆందోళనలో ఖాతాదారులు
రూ.50 లక్షల వరకు టోకరా
పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న బాధితులు
రాయికల్ రూరల్, అక్టోబర్ 21: రాయికల్లో మూడేండ్ల క్రితం ఏర్పాటు చేసిన ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ బోర్డుతిప్పేసింది. కంపెనీ బాధ్యులు వినియోగదారులకు రూ. 50 లక్షల దాకా టోకరా పెట్టి అదృశ్యమయ్యారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో మూడు సంవత్సరాల క్రితం ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్ రిజిస్టర్ నంబర్ ఎంఏసీఎస్ఆర్ 12732017 పేరిట ఐత నిశాంత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. తానే జోనల్ మేనేజర్గా వ్యవహరిస్తూ స్థానికులను ఏజెంట్లుగా నియమించుకున్నాడు. అధిక వడ్డీ ఇస్తామని వీరి ద్వారా వ్యాపారులు, చిన్నచిన్న దుకాణాల నిర్వాహకుల నుంచి సుమారు రూ. 50 లక్షలు సేకరించారు. రోజుకు రూ. 50 నుంచి రూ. 500 దాకా ఎంతైనా కట్టవచ్చని నమ్మబలికాడు. సంవత్సరం పాటు కడితే వడ్డీ కలిపి ఇస్తామని ప్రచారం చేశారు. మొదటి ఏడాది సరిగ్గానే చెల్లింపులు చేశారు. ఇది నమ్మి రాయికల్తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 100-150 మంది వరకు సొసైటీలో డబ్బులు జమ చేశారు. అయితే గడువు ముగిసి మూడు నెలలు గడిచినా నగదు చెల్లించలేదు. కొందరికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. పదిరోజుల క్రితం బాధితులు కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. అప్పటి నుంచి ఆఫీసును తెరువడంలేదు. ఏజెంట్లు, కంపెనీ బాధ్యులకు ఫోన్లు చేయగా స్విచ్ఛాప్ వస్తున్నదని బాధితులు తెలిపారు. త్వరలోనే పోలీసులను ఆశ్రయిస్తామని చెప్పారు. ఇదే విషయంపై పోలీసుల స్పందన కోరగా ముద్ర సొసైటీ మోసానికి పాల్పడిన విషయం తమ దృష్టికి వచ్చిందని, కానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఫిర్యాదు అందితే చట్టప్రకారం చర్యలకు ఉపక్రమిస్తామని పేర్కొన్నారు.