కార్పొరేషన్, జనవరి 21: అర్హులంతా కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్ కోరారు. నగరంలోని 37వ డివిజన్లో శుక్రవారం చేపట్టిన ఇంటింటా జ్వర సర్వేను ఆమె ప్రారంభించారు. ఏఎన్ఎంలు, ఆర్పీలతో కలిసి ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ, కరోనా లక్షణాలున్న వారు నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్ వస్తే హోం ఐసొలేషన్లో ఉంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నగరపాలక సంస్థ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వర్రావు, మెప్మా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జనవరి 21: కొత్తపల్లి పట్టణంలోని 7వ వార్డులో జ్వర సర్వేను మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వే పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. సర్వేకు వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అనంతరం సర్వే సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్లు, డెటాల్, గ్లౌస్ల కిట్లు అందజేశారు. పట్టణంలో సుమారు 739 మంది వివరాలు సేకరించగా 20 మందికి జ్వర లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీవాణి, బోగ రమేశ్, ఏఎన్ఎంలు ఉమ, సంధ్య, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యానగర్, జనవరి 21: జిల్లా వ్యాప్తంగా 648 టీంలు శుక్రవారం ఇంటింటా జ్వర సర్వే చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జువేరియా ఒక ప్రకటనలో తెలిపారు. 41897 ఇండ్లల్లో సర్వే చేసినట్లు పేర్కొన్నారు. 969 మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించి హోం ఐసొలేషన్ కిట్లు అందజేసినట్లు తెలిపారు.