రైతు వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహజ్వాల
అన్నదాతలతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఆందోళన
బీజేపీ సర్కారు నిర్లక్ష్యంపై ఊరూరా నిరసన
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల శవయాత్రలు.. దహనాలు
ర్యాలీలు, రాస్తారోకోలు.. హోరెత్తిన నినాదాలు
పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీచైర్మన్లు, ప్రజాప్రతినిధులు
కరీంనగర్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) ;కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ చావుడప్పు మోగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో సోమవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించింది. యాసంగి వడ్లు కొనబోమని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్లో కొని తెలంగాణలో ఎందుకు కొనరని నిలదీసింది. వడ్లు కొంటామని చెప్పేదాకా వదిలేది లేదని స్పష్టం చేసింది. ఊరూరా కేంద్ర ప్రభుత్వ, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలతో శవయాత్రలు తీసి, దహనం చేసింది. దేశం కోసం ధర్మం కోసం కొనాలని రాసిన ప్లకార్డులను ప్రదర్శించి, నినదించింది. ధర్మారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొనగా, మానకొండూర్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గంగాధరలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొని హోరెత్తించారు.
కరీంనగర్లో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు చావుడప్పులు మోగించి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మానకొండూర్లో స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వయంగా చావు డప్పు కొట్టి బీజేపీ నాయకులను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. గంగాధర మండల కేంద్రంలోని మధురానగర్ చౌరస్తాలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. హుజూరాబాద్లో నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు స్థానిక బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.
రైతుల గోస తగుల్తది
రైతులను ఇబ్బంది పెట్టుడు సరికాదు. రైతుల గోస మోడీకి తప్పకుండా తగుల్తది. ఇట్ల వడ్లు కొనేది లేదని గతంలో చెప్పిన ప్రభుత్వాలు ఎప్పుడూ సూడలే. కేంద్రం నిర్ణయంతో రైతులు బాధపడుతున్నరు. ఒక రాష్ట్రంలో వడ్లు కొని మరో రాష్ట్రంలో కొనేది లేదని చెప్పడం కక్ష పూరితమే. రైతుకు మంచి చేయాల్సిన కేంద్రం వారి అభివృద్ధిని అడ్డుకునేలా చేస్తున్నది. ఈ విషయంలో బీజేపీ నిర్ణయం చాలా తప్పు.పైడిపాల సింగరయ్య, రైతు, చింతకుంట (కొత్తపల్లి)
కొనేదాకా కొట్లాడుతం
రాష్ట్ర సర్కారు ప్రతిష్టను దెబ్బ తీసేందుకే కేంద్రం కుట్ర పన్నింది. ఆరేండ్లుగా ఎక్కడా ఇబ్బంది లేకుండా దొడ్డు వడ్ల కొనుగోళ్లు జరుగుతుంటే ఓర్వలేకపోయింది. వచ్చే సీజన్లో ధాన్యం కొనబోమని చెబుతున్నది. వాళ్ల ఆటలు తెలంగాణలో సాగవు. బీజేపీ సర్కారు చేస్తున్న మోసంపై ఊరూరా చర్చ జరగాలి. ఢిల్లీలో ఒకటి.. గల్లీల లీడర్లు ఇంకోటి మాట్లాడి గందరగోళం సృష్టిస్తున్నందుకే ఈ రోజు చావు డప్పుకొట్టినం. బీజేపీది అంతా మోస పూరిత పాలనే. ఇన్నేండ్లలో ఒక్క సంక్షేమ పథకమైనా అమలు చేసిందా.. ప్రపంచ రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వకపాయె. బీజేపీ నాయకుల ఝూటా మాటలు అసలే నమ్మవద్దు. ఊరుకునేదే లేదు. యాసంగి ధాన్యం కొనేదాకా కొట్లాడుతం.కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర మంత్రి
బీజేపీకి రోజులు దగ్గర పడ్డయ్..
తెలంగాణ సర్కారు రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. కానీ, రాష్ట్ర రైతులపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ధాన్యం సేకరణలో తీవ్ర వివక్ష చూపుతున్నది. కొనుగోళ్ల విషయంపై స్పష్టత ఇవ్వకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. బీజేపీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డట్లే. పాడె కట్టే టైం దగ్గరలోనే ఉంది. ధాన్యం సేకరణపై ఇప్పటికైనా స్పష్టమైన వైఖరి చెప్పాలి. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తం.