సిరిసిల్ల హాస్పిటల్లో రూ.2.30 కోట్లతో ఏర్పాటు
అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యం
24 గంటలు ఉచిత సేవలు
గత జూలైలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజానీకం
-సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 20;రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖాన కార్పొరేట్ తరహా వైద్య సేవలకు కేరాఫ్గా నిలుస్తున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పేదలకు మెరుగైన వైద్యం అందుతున్నది. అత్యాధునిక వైద్య పరికరాలు, అన్ని సౌకర్యాలతో ఆదర్శంగా నిలుస్తున్నది. వీటికితోడు ఇటీవల రూ.2.20 కోట్లతో సీటీస్కాన్ సేవలు అందుబాటులోకి రావడంతో జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లా ప్రభుత్వ దవాఖాన వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు హాస్పిటల్కు వచ్చిన రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలంటే రక్త, మూత్ర పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉండేవి. రోడ్డు ప్రమాదాల బారినపడిన వ్యక్తికి తలకు స్కానింగ్ చేయాలన్నా, కరోనా నిర్ధారణ పరీక్షల కోసం హెచ్ఆర్సీటీ పరీక్ష, గుండె, బ్రెయిన్, తదితర పరీక్షల నిర్వహణ కోసం ప్రైవేటు దవాఖానలకు తరలించే పరిస్థితి ఉండేది. ప్రైవేటులో స్కానింగ్ ధరలు అధికంగా ఉండడంతో పేదల జేబులు ఖాళీ అయ్యేవి. దీంతో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో సర్కారు దవాఖానలో సీటీ స్కానింగ్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలో రూ.2.20కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించి అత్యాధునిక పరికరాలతో కూడిన సీటీ స్కానింగ్ సేవలను ఏర్పాటు చేశారు.
జిల్లా దవాఖానలోని సీటీ స్కానింగ్ కేంద్రంలో ‘16ైస్లెస్ సిటీ స్కాన్ హోల్ బాడీ స్కానర్’ ఆధునిక స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటుచేశారు. హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్లో స్కానింగ్ సెంటర్కు ప్రత్యేక గదిని కేటాయించారు. ఇందులో ఇద్దరు టెక్నీషియన్లు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. హెచ్ఆర్సీటి, చెస్ట్, బ్రెయిన్, అబ్డామిన్, సైనస్, ఫేషియల్, పెల్విస్, తదితర స్కానింగ్ పరీక్షలు ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చారు. రోజుకు 40 నుంచి 50మంది రోగులకు పరీక్షలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షల కోసం ప్రైవేటు స్కానింగ్ కేంద్రాల్లో ఒక్కో పరీక్షకు సుమారు రూ.5వేలకు పైగా వసూలు చేస్తున్నారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న సమయంలో హెచ్ఆర్సీటీ పరీక్షల కోసం ప్రైవేటులో ఒక్కో రోగి నుంచి రూ.6వేలు ఫీజు తీసుకున్నట్లు సమాచారం. సర్కారు దవాఖానలో ఖరీదైన వైద్య పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి రావడంతో జిల్లా ప్రజానీకం మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
వైద్యుల సూచన మేరకే పరీక్షలు..
సీటీ స్కానింగ్ సెంటర్లో పరీక్షలు దవాఖాన వైద్యుల సూచన మేరకే నిర్వహిస్తున్నారు. ఆయా సమస్యలతో వచ్చిన వారిని స్థానిక వైద్యులు పరీక్షించి స్కానింగ్ తప్పనిసరి అని సూచిస్తేనే పరీక్ష చేస్తామని వైద్యులు తెలిపారు. పరీక్ష చేసిన అనంతరం హైదరాబాద్లోని నిమ్స్ వైద్యులకు రిపోర్డులు ఆన్లైన్లో పంపించి వారు సూచించిన మేరకు రోగులకు వ్యాధి నిర్ధారణ వివరాలను లిఖిత పూర్వకంగా అందజేయనున్నారు. గత జూలై 27న అందుబాటులోకి వచ్చిన సీటీ స్కానింగ్ ద్వారా ఇప్పటివరకు హెచ్ఆర్సీటీ పరీక్షలు 176, బ్రెయిన్ స్కానింగ్ 287, పీడబ్ల్యూఎస్ 9, ఏబీడీ 13, సీఎస్2-1, ఎల్ఎస్ఆర్-1, కేయూబీ-2 పరీక్షలు చేసినట్లు జిల్లా దవాఖాన వైద్యులు తెలిపారు.
అందుబాటులో ఆధునిక వైద్యం..
గతంలో స్కానింగ్ పరీక్షల కోసం రోగులను ప్రైవేటుకు పంపించేవాళ్లం. పేదలకు స్కానింగ్ పరీక్ష భారమయ్యేది. మంత్రి కేటీఆర్ రూ.2.15కోట్లు నిధులు ప్రభుత్వం ద్వారా మంజూరు చేశారు. దీంతో రోగ నిర్ధారణలో కీలకమైన సీటీ స్కానింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరీక్షల కోసం ప్రైవేటులో వేలాది రూపాయలు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా ఏర్పాటుచేసిన సీటీ స్కానింగ్ పరీక్షలను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలి.
-మురళీధర్రావు, సూపరింటెండెంట్