రాంనగర్, డిసెంబర్ 20: శివారు ప్రాంతాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ అడిషనల్ డీసీపీ (పరిపాలన) చంద్రమోహన్ సూచించారు. సోమవారం కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని హనుమాన్నగర్లో కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివరాలు తెలియని వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వవద్దన్నారు. అసాంఘిక, అక్రమ కార్యకలాపాలకు పాల్పడి, ఇకడ తలదాచుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. కొత్తగా ఇళ్ల అద్దెకోసం వచ్చిన వారి వివరాలను సంబంధిత పోలీస్స్టేషన్, బ్లూక్లోల్ట్స్ బృందాలకు అందజేస్తే నిమిషాల వ్యవధిలో సదరు వ్యక్తుల వివరాలను ఉచితంగా తెలియజేస్తామన్నారు. వాహనాల క్రయవిక్రయాల సందర్భంగా ఇరువర్గాలకు చెందిన వాహనదారులు వారి పేరిట చెల్లుబాటు అయ్యే ధ్రువపత్రాలను పొందాలన్నారు. లేకుంటే ప్రమాదాలు, అక్రమ, అసాంఘిక కార్యకలాపాలు సదరు వాహనాలతో జరిగినట్లయితే వాహనం ఎవరి పేరిట ఉంటే వారిపైనే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. నేరాల నియంత్రణ, ఛేదనకు దోహదపడే సీసీ కెమెరాల ఏర్పాటుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం అనుమానిత వ్యక్తులను ఫోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైజ్ ద్వారా తనిఖీ చేశారు. ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు జరిగిన కార్డన్సెర్చ్లో సరైన ధ్రువ పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు, మూడు కార్లు, మూడు ఆటోలు, ఆరు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారథి, ఇన్స్పెక్టర్లు విజ్ఞాన్రావు, శశిధర్రెడ్డితో పాటు వివిధ విభాగాలకు చెందిన వందమంది పోలీసులు పాల్గొన్నారు.