డ్రా పద్ధతిలో 93 దుకాణాలు కేటాయింపు
మొగ్దుంపూర్ మద్యం దుకాణం నిలిపివేత
రాంనగర్, నవంబర్ 20: జిల్లాలో 2021-23 సంవత్సరానికి గానూ 94 మద్యం దుకాణాలకు శనివారం డ్రా పద్ధతిలో ఎంపిక ప్రక్రియ చేపట్టారు. 94 మద్యం దుకాణాలకు గురువారం వరకు దరఖాస్తు చేసుకునే సమయం ఉండగా 1694 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం లాటరీ పద్ధతిలో డ్రా నిర్వహించి 93 మద్యం దుకాణాలను కేటాయించారు. 10 గంటలకు ప్రారంభమైన ఎంపిక ప్రక్రియ సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగింది. ముందుగా కరీంనగర్ అర్బన్ దుకాణాల కేటాయింపు జరురుగా, పోటీ విపరీతంగా ఉండడంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దుకాణాల కేటాయింపు డ్రా పద్ధతిలో తీయగా డ్రాలో వచ్చిన వ్యక్తులు కార్యక్రమానికి హాజరుకాకపోయినా అధికారులు కేటాయించడం కొంత వివాదానికి దారి తీసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వ్యాపారులు కరీంనగర్ సిండికేట్ వ్యాపారులు దుకాణాలు చేజిక్కించుకునేందుకు బెదిరింపులకు దిగారని, దుకాణాలు పొందిన వారిని అందుబాటులో లేకుండా చేశారని ఆరోపించారు. దీంతో అరగంట పాటు ఎంపిక ప్రక్రియను నిలిపివేసి అందరికి నచ్చజెప్పడంతో పరిస్థితి సర్దుమణిగింది. మరోవైపు కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ మద్యం దుకాణానికి తక్కువ దరఖాస్తులు రావడంతో దాని ఎంపిక ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కేవలం 5 దరఖాస్తులు మాత్రమే రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దరఖాస్తుల రూపేణా రూ.33 కోట్ల 88 లక్షల ఆదాయం, 93 మద్యం దుకాణాలు ఖరారు కావడంతో మరో 9 కోట్లు ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. అబారీ అధికారి చంద్రశేఖర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తాతాజీ, ఎన్ఫోర్స్మెంట్ అధికారి నర్సింహారెడ్డి, సీఐలు విజయకుమార్, చంద్రమోహన్, ఇంద్రప్రసాద్, అక్బర్ హుస్సేన్, దుర్గాభవానీ తదితరులు పాల్గొన్నారు.