అసెంబ్లీ ఎన్నికల హడావిడి తగ్గిందో లేదో.. అప్పుడే పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. 2024 ఫిబ్రవరి ఒకటితో పాలకవర్గాల గడువు ముగియనుండగా కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా, వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉండే ఓటర్ల సంఖ్య ఆధారంగా ఎంతమంది ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులను నియమించాలో నిర్దేశిస్తూ, స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగా, పల్లెల్లో ఎన్నికల సందడి మొదలుకాబోతున్నది.
– కరీంనగర్, డిసెంబర్ 6 (నమస్తేతెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, డిసెంబర్ 6 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): సర్పంచ్ ఎన్నికలను నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను తాజాగా విడుదల చేసింది. ఆ ఆదేశాలు కలెక్టర్లకు అందడంతో యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. 2019 జనవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా, పాలకవర్గాల పదవీకాలం 2024 ఫిబ్రవరి1తో ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సమర్థవంతంగా నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేసుకోవాలని సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అంతేకాదు, పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో.. వారికి తగ్గట్టుగా ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులను నియమించాలో నిర్దేశిస్తూ, స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (లెటర్ నంబర్ 921/టీఎస్ఇసీ-పీఆర్/2023) తాజాగా ఆదేశాలు జారీచేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను 2029 జనవరిలో వివిధ దశల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. నిబంధనల ప్రకారం 2024 ఫిబ్రవరి 1తో ప్రస్తుత సర్పంచులతో పాటు పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని 243(3)(ఏ) ఆర్టికల్ ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికలను ఐదేళ్ల పదవీ కాలం ముగిసేలోపే నిర్వహించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అంతేకాదు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 14(2) ప్రకారం గ్రామ పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియడానికి మూడు నెలల్లోపు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుందని చెప్పింది.
గడువు ముగుస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని నియమించడంతోపాటు పంచాయతీ ఎన్నికల కోసం సదరు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించింది. దీంతో పాటు పోలింగ్ కేంద్రాల పరిధిలో సిబ్బందిని నియమించడానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 200 ఓటర్లు ఉన్న పోలింగ్స్టేషన్ పరిధిలో ఒక ప్రిసైడింగ్ అధికారి ఒక పోలింగ్ అధికారిని నియమించాలని సూచించింది.
అలాగే 201 నుంచి 400 మంది ఓటర్లు ఉన్న కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు.. 401 నుంచి 650 వరకు ఓటర్ల ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించుకోవాలని ఆదేశించింది. ప్రతి వార్డులో ఒక పోలింగ్ బూత్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, 650 దాటితే రెండు పోలింగ్కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. సిబ్బందితోపాటు ప్రిసైడింగ్ అధికారులతో జాబితా సిద్ధం చేసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.
ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో జిల్లా అధికారులు అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నారు. సర్పంచ్ ఎన్నికలు ఏ సమయంలోనైనా వచ్చే అవకాశమున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఓటర్లు పెద్ద సంఖ్యలో పెరిగారు. ఈ నేపథ్యంలో వార్డుల వారీగా ఉన్న ఓటర్ల వివరాలను ఆయా జిల్లాల పంచాయతీరాజ్ శాఖ సిద్ధం చేస్తున్నది.
దీంతో పాటు పంచాయతీ ఎన్నికల్లో వార్డులు, పంచాయతీలు రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంటుంది. దీనికోసం అధికారులు గణాంకాలను తీస్తున్నారు. అయితే ఎన్నికలు నిబంధనల ప్రకారం ఇన్టైంలో జరుగుతాయా..? లేదా..? అన్నది మాత్రం నూతనంగా ఏర్పడుతున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉండనున్నది.