మఠంపల్లి, జూన్ 8 : మండలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని వైద్యాధికారి ఫిరోజ్ తెలిపారు. మండల కేంద్రంతోపాటు యాతవాకిళ్ల, సుల్తాన్పురంతండా, పెదవీడు, బక్కమంతులగూడెం గ్రామాల్లో మంగళవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు. 305మందికి పరీక్షలు చేయగా 10మందికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. మండల కేంద్రంలో 3వ విడుత జ్వర సర్వే చేస్తున్నట్లు తెలిపారు.
కరోనా కట్టడిలో బాధ్యతగా వ్యవహరించాలి
గరిడేపల్లి : కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివాస్గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఉపాధీ హామీ పని చేస్తున్న 32 మంది కూలీలకు సర్పంచ్ సీతారాంరెడ్డి, ఎంపీటీసీ కడియం స్వప్నావెంకట్రెడ్డితో కలిసి గరిడేపల్లి పీహెచ్సీ వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు చేయించారు. పని చేసే చోట మాస్కులు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భద్రయ్య, కో ఆప్షన్ సభ్యుడు వెంకట్రెడ్డి, ఏఎన్ఎం కవిత, ఆశ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
అర్హులంతా టీకాలు వేయించుకోవాలి : జడ్పీటీసీ
హుజూర్నగర్ రూరల్ : అర్హులంతా కరోనా టీకాలు వేయించుకోవాలని జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి అన్నారు. మండలంలోని అమరవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో లింగగిరి పీహెచ్సీ ఆధ్వర్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 25మందికి పరీక్షలు చేయగా ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. సర్పంచ్ సుజాతాఅంజిరెడ్డి, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మందుల పంపిణీ అభినందనీయం
గరిడేపల్లి : కరోనా పేషెంట్లకు మందుల పంపిణీ అభినందనీయమని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు పోటు సూర్యం అన్నారు. మండలంలోని వెలిదండ గ్రామంలో కరోనా పేషెంట్లకు సీపీఐఎంఎల్ గ్రామశాఖ ఆధ్వర్యంలో బయోగ్రీన్ రెమిడీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆర్థిక సహకారంతో రూ.1.60లక్షల విలువ చేసే ఆయుర్వేదిక్ మందుల పంపిణీని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ కృష్ణప్రసాద్, పార్టీ నాయకులు పోటు లక్ష్మయ్య, ఆదూరి కోటయ్య, కామళ్ల నవీన్, అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి, మహేశ్, కనకారావు తదితరులు పాల్గొన్నారు.
కూరగాయలు, సరుకులు పంపిణీ
హుజూర్నగర్ రూరల్/హుజూర్నగర్ : మండలంలోని లక్కవరంలో కరోనా పేషెంట్ల కుటుంబాలకు సర్పంచ్ రణపంగు సౌజన్య ఆధ్వర్యంలో ఎంపీడీఓ వరప్రసాద్ చేతుల మీదుగా కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీఓ మౌలానా, కార్యదర్శి గిరిజకుమారి, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. అలాగే మున్సిపాలిటీలోని 8వ వార్డులో కరోనా పేషెంట్ల కుటుంబాలకు కౌన్సిలర్ చిలకబత్తిని సౌజన్య మంగళవారం కోడిగుడ్లు పంపిణీ చేశారు. విష్ణువర్ధన్, ప్రసాద్, శాంతమ్మ, కిశోర్, రాజు పాల్గొన్నారు.