సిద్దిపేట జోన్, మే 23 : వృత్తిధర్మాన్ని, బాధ్యతను మరువకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని వైద్యాధికారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలోని మెడికల్ కళాశాల దవాఖానలోని కొవిడ్ వార్డులో రోగులకు అందుతున్న వసతులను ఆదివారం మంత్రి పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ, అందుతున్న వైద్యంపై మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ అరస్, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ జయశ్రీ, అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు, వారు అందిస్తున్న సేవలపై ఆరాతీశారు. అనంతరం వారితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. దవాఖానకు వచ్చే కరోనా రోగులకు ఇబ్బంది రావద్దని, బాధ్యతగా పనిచేసి రోగులకు భరోసా ఇవ్వాలన్నారు. వ్యక్తులతో వ్యవస్థకు చెడ్డపేరు రావొద్దని, బాధ్యాతయుతంగా పనిచేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
దవాఖానకు అవసరం ఉన్నా తన దృష్టికి తేవాలన్నారు. ప్రతి వైద్య ఉద్యోగి బాధ్యతగా పనిచేయాలని, రోగికి ఆత్మీయ పలకరింపే చాలా ముఖ్యమని, కొవిడ్ వార్డులో ట్రీట్మెంట్ కంటే రోగుల బాగోగులు చూడడమే ముఖ్యమన్నారు. ఇక నుంచి వారం పది రోజులు సిస్టట్ స్ట్రీమ్లైన్ అయ్యే వరకు అందరూ కుటుంబ సభ్యులుగా కలిసి పనిచేద్దామని, ఈ దవాఖాన మనందరిది అని వైద్య సిబ్బంది, అధికారులకు మంత్రి పిలుపునిచ్చారు. పేషెంట్లను కుటుంబ సభ్యులు నేరు గా కలిసేందుకు వీలుగా జిల్లా యం త్రాంగంతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని, వారు కుటుంబ సభ్యులు, పేషెంట్ల వివరాలను రిజిస్టర్లో నమోదు చేసి సంబంధిత పాసు జారీ చేస్తారన్నారు. పాస్ ఉన్న వారిని కొవిడ్ వార్డులోకి వెళ్లేందుకు అవకాశం కల్పించనున్నామని మంత్రి తెలిపారు. ఇ
లాంటి క్లిష్ట సమయంలో కొవిడ్ రోగుల దగ్గరికి రావడానికి కుటుంబ సభ్యులే భయపడుతున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న వైద్యసిబ్బందిని మంత్రి అభినందించారు. సిద్దిపేట జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో చికిత్స తీసుకొని క్లిష్ట పరిస్థితుల్లో చివరి దశలో ప్రభుత్వ దవాఖానకు రోగులను తీసుకొస్తున్నారని, ప్రైవేటు దవాఖానలు సైతం క్లిష్ట పరిస్థితుల్లో రోగులను డిశ్చార్జ్ చేస్తున్నాయని, ఇలా చేస్తే ప్రైవేటు దవాఖానలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వచ్చిన వారు ముందస్తుగా చికిత్స తీసుకోక, పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు దవాఖానలో జాయిన్ కావడంతో రెండు మూడు గంటల్లోనే చేయి దాటిపోయిన సంఘటనలు ఉన్నాయని, అయినప్పటికీ వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్నారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు కాశీనాథ్, చందర్, క్రాంతి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, కౌన్సిలర్లు సాయి, దీప్త్తీనాగరాజు, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.