అనేక దేశాలు మన ఆచారాలు, పద్ధతులే పాటిస్తున్నయ్
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్
హుజూరాబాద్. జమ్మికుంటలో నిమజ్జనోత్సవాలకు హాజరు
ప్రత్యేక పూజలు
హుజూరాబాద్, సెప్టెంబర్ 19: మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు అనేక దేశాలకు ఆదర్శమని, ప్రపంచంలోని అనేక దేశాలు మన ఆచారాలు, పద్ధతులను పాటిస్తున్నాయని హుజూ రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ ఉద్ఘాటించారు. ఇప్పటికీ చాలా దేశాలు మనం ఆచరిస్తున్న సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయని చెప్పారు. ఆదివారం హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో నిర్వహించిన గణేశ్ నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ముందుగా హుజూరాబాద్ కరీంనగర్ రోడ్డులోని కాకతీయ కాలువ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద వీహెచ్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతుల స్వాగతోపన్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం శ్రీనివాస్ మాట్లాడారు. మన ఆచారాలను, పద్ధతులను ముందు తరాలకు అందించడంలో మహిళలందరూ ఉన్నారని చెప్పవచ్చునన్నారు. ఈ సందర్భంగా అతివలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. కాగా, నిమజ్జన వేడుకల్లో భాగంగా రాత్రి హుజూరాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో గెల్లు శ్రీనివాస్ మహిళలతో కలిసి ఉత్సాహంగా కోలాటం ఆడారు. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు తాళ్లపెల్లి శ్రీనివాస్, కళ్లెపెల్లి రమాదేవి, కేసీరెడ్డి లావణ్య, కొండ్ర జీవిత, పైళ్ల వెంకట్రెడ్డి, గనిశెట్టి ఉమయశంకర్, విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్లెపు సుధాకర్రావు, పట్టణ గౌరవ అధ్యక్షుడు పుల్లూరి ప్రభాకర్రావు, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బుర్ర నటరాజ్, పట్టణ శాఖ అధ్యక్షుడు కొమురవెల్లి రాజు తదితరులున్నారు.
జమ్మికుంటలో విస్తృత పర్యటన
గణేశ్ నవరాత్రోత్సవాల్లో చివరి రోజు కావడంతో గెల్లు శ్రీనివాస్ జమ్మికుంటలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం నుంచి పట్టణంలోని అన్ని కాలనీలు, బస్తీలు, వాడలను చుట్టుముట్టి 89 గణేశ్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గెల్లు శ్రీనివాస్కు డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, నృత్యాలతో మండపాల నిర్వాహకులు ఆత్మీయ స్వాగతం పలికారు. మండపాల నిర్వాహకులు, పూజారులు, స్థానికులు, మహిళలు, యువకులను పలుకరించారు. నిర్వాహకుల సతారాలు, పూజారుల ఆశీస్సులు పొందారు. వారిచ్చిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక్కడ మున్సిపల్ ఛైర్మన్ రాజేశ్వర్రావు, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్, కౌన్సిలర్లు మల్లయ్య, భాసర్, దయాల శ్రీనివాస్, రమేశ్, రాము, టీఆర్ఎస్ నాయకులు కోటి, వెంకటేశ్, సంపత్, టీఆర్ఎస్ యువజన నాయకులు రాజిరెడ్డి, హరిబాబు, రాకేశ్, చాంద్ పాషా, ముస్తాఫా ఉన్నారు.