పోత్గల్ వాసికి అరుదైన అవకాశం
1986 నుంచి వైద్య వృత్తి
సేవ చేయాలనే లక్ష్యంతో 30 ఏండ్ల క్రితం ముస్తాబాద్లో దవాఖాన ఏర్పాటు
అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే,ప్రస్తుత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
మూడు దశాబ్దాలకుపైగా పేదలకు ఉచిత వైద్యం
తాజాగా దక్కిన గుర్తింపు
సిరిసిల్ల/ముస్తాబాద్, మే 19 : ప్రజా వైద్యుడు.. పోత్గల్ వాసి ఎరవెల్లి చంద్రశేఖర్రావుకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. సొంత మండలం ముస్తాబాద్లో వైద్యశాలను ప్రారంభించి, మూడు దశాబ్దాలకుపైగా పేదలకు ఉచిత వైద్యసేవలందిస్తున్న ఆయనను గుర్తించి ఈ అవకాశం కల్పించింది. బుధవారం ఏడుగురు సభ్యులు, చైర్మన్తో కూడిన టీఎస్పీఎస్సీ కొత్త కమిటీని సీఎం కేసీఆర్ ప్రకటించగా, అందులో చంద్రశేఖర్రావుకు చోటు దక్కడంపై గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమైంది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా నియమితులైన ఎరవెల్లి చంద్రశేఖర్రావుది ముస్తాబాద్ మండలం పోత్గల్. తల్లిదండ్రులది సాధారణ వ్యవసాయ కుటుంబం. ఎరవెల్లి వరమ్మ, చినరామారావు దంపతుల ఇద్దరు కొడుకుల్లో చిన్నోడు. 1961 ఫిబ్రవరి 12న జన్మించారు. పదో తరగతి దాకా పోత్గల్లోనే చదివారు. హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేసి, విజయవాడలో బీఏఎంఎస్ చదివి, పట్టా పొందారు. వైద్య విద్య పూర్తిచేసిన చంద్రశేఖర్రావు, సొంతూరులోనే ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. తన భార్య అనూరాధ(గైనకాలజిస్ట్)తో కలిసి 1986లో ముస్తాబాద్ మండల కేంద్రంలో తిరుమల నర్సింగ్ హోం దవాఖానను ఏర్పాటు చేశారు. అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత సీఎం కేసీఆర్తో ప్రారంభించారు.
ముస్తాబాద్, దుబ్బాక, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల ప్రజలకు ఆరోగ్యకార్డులు అందించి ప్రవేశ రసుం లేకుండానే వైద్యం చేశారు. పేదరికంతో ఉన్న వారికి, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి దంపతులిద్దరూ ఉచితంగా వైద్యం, మందులు అందించారు. తోటి వైద్యుల సహకారంతో ఆయా గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించారు. నవజ్యోతి స్వచ్ఛంద సంస్థ ద్వారా దుబ్బాక మండలంలోని వృద్ధులు, దివ్యాంగులకు పదేండ్లుగా వైద్యసేవలందిస్తూనే సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రశేఖర్రావు దంపతులు దాదాపుగా 33 ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. సౌమ్యుడిగా, వివాదరహితుడుగా పేరుతెచ్చుకున్నారు. మొదట బీజేపీలో ఉన్నా, 2014 టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీకి కూడా సేవలందిస్తున్నారు. తాజాగా ఆయన సేవలకు గాను గుర్తింపు దక్కింది. టీఎస్పీఎస్సీ చైర్మన్తోపాటు ఏడుగురు సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించగా, చంద్రశేఖర్రావుకు అందులో అవకాశం దక్కింది. నియామకంపై పోత్గల్ గ్రామస్తులతోపాటు ఆయన మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి ఉచిత సేవలందిస్తున్న ఆయనకు సీఎం తగిన గుర్తింపు ఇచ్చారని చెబుతున్నారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
నాపై నమ్మకంతో టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటా. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తా. పార్టీ లో అంకితభావంతో పనిచేస్తూ పోతే సరైన గౌరవం, అవకాశాన్ని సీఎం కేసీఆర్ ఇస్తారనేందుకు ఇదే నిదర్శనం. నా నియామకానికి సహకరించిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు.
–చంద్రశేఖర్రావు, వైద్యుడు
నిబద్ధత కలిగిన వ్యక్తి..
చంద్రశేఖర్రావు సామాన్య కుటుంబంలో జన్మించిచాడు. బాల్యం నుంచే ఎన్నో కష్టాలు, ఆటుపోట్లను అధిగమించిన గొప్ప వ్యక్తి. విజయవాడలో బీఎఎంఎస్ చదువుతున్న కాలంలో రాజకీయ నాయకత్వ లక్షణాలు చూపిన చంద్రశేఖర్రావుకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం సంతోషం. సీఎం కేసీఆర్ విధేయతకు పట్టంగట్టి మంచి పదవి కట్టబెట్టారు.
జిల్లాకే గర్వకారణం !
రాజన్న సిరిసిల్ల, మే 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా డాక్టర్ ఎరవెల్లి చంద్రశేఖర్రావు నియామకం కావడం సిరిసిల్ల జిల్లాకే గర్వకారణమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోత్గల్కు చెందిన ఆయన 30ఏళ్లుగా గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలందించడం చాలా గొప్ప విషయమన్నారు. టీఆర్ఎస్ బలోపేతానికి విశేషంగా కృషిచేశారన్నారు. పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందనడానికి చంద్రశేఖర్ నియామకమే నిదర్శనమన్నారు. చంద్రశేఖర్రావుకు తగిన గుర్తింపు ఇచ్చిన కేసీఆర్, కేటీ ఆర్కు ఈ సందర్భంగా నర్సింగరావు కృతజ్ఞతలు తెలిపారు.