ఇల్లందకుంట, మార్చి13: ఇల్లందకుంట క్లస్టర్ అసిస్టెంట్ (సీఏ)గా పనిచేస్తున్న చిన్న కోమటిపల్లికి చెందిన చిట్ల సంధ్యారాణి, అందరిలా ఆలోచించలేదు. సొంతకాళ్లపై నిలబడాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసింది. బ్యాంకు నుంచి 2 లక్షల రుణం తీసుకొని హారతి కర్పూరం బిల్లల యూనిట్ను ఏర్పాటు చేసింది. ఇల్లందకుంట ఎస్బీఐ బ్యాంక్ నుంచి 2లక్షల రుణం తీసుకొని మిషన్ను కొనుగోలు చేసింది. ఇంటివద్దనే భర్త రవి, ఇద్దరు కూతుర్లతో కలిసి కర్పూరం బిల్లలను తయారు చేస్తున్నది. గంటకు 15 కిలోల కర్పూరం బిల్లలు తయారు చేసి, ఆర్డర్లపై పంపిస్తున్నది.
కాళేశ్వరం, వేములవాడ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతోపాటు కిరాణాదుకాణాలకు సరఫరా చేస్తున్నది. ప్రతినెలా 25వేల దాకా సంపాదిస్తున్నది. యూట్యూబ్లో హారతి కర్పూరం బిల్లల తయారీని చూసి యూనిట్ను ఏర్పాటు చేశానని సంధ్యారాణి చెబుతున్నది. తన భర్త ఆటో ద్వారా ఆర్డర్లు ఇచ్చిన దుకాణాలకు సరఫరా చేస్తున్నాడని, ప్రస్తుతం వ్యాపారం బాగానే ఉన్నదని, మున్ముందు ఈ వ్యాపారాన్ని విస్తరిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నది.