అత్యంత వేగంగా కరోనా వ్యాక్సినేషన్
మిగిలింది ఇక 25,930 మంది మాత్రమే
ఈ నెల 26 వరకు పూర్తి చేయాలని లక్ష్యం
వైరస్ ఉధృతికి అడ్డుకట్ట
కరీంనగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: కరోనా టీకాల పంపిణీలో కరీంనగర్ జిల్లా దూసుకెళ్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గతేడాది జనవరి 16 నుంచి టీకాలు ఇస్తుండగా, ప్రాధాన్యతా క్రమంలో మొదట ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు, ఆ తర్వాత 60 ఏండ్లు పైబడిన వారికి, ఆ తర్వాత 40 ఏండ్లు పైబడిన, 18 ఏండ్లు పైబడిన వారికి టీకాలు ఇస్తూ వచ్చారు. మొదటి డోసు తర్వాత వ్యాక్సిన్ నిల్వలను బట్టి రెండో డోసు టీకాలు ఇస్తూ వచ్చారు. జిల్లాలో మొత్తం 11,19,947 మంది ఉండగా, ఇందులో 7,92,923 మంది లక్ష్యంగా అధికారులు టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి 8,11,296 మందికి వేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడిన వారికి కూడా టీకాలు ఇచ్చారు. ఇలా లక్ష్యానికి మించి 18,373 మందికి అధికంగా వేశారు. అంటే 102.32 శాతంగా లక్ష్యానికి మించి టీకాలు వేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఒక్క కరీంనగర్ నియోజకవర్గంలోని కరీంనగర్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా టీకాలు వేశారు. ఇక్కడ 19,672 మందికి ఎక్కువగా టీకాలు వేశారు. మానకొండూర్ నియోజవకర్గంలోనూ 462 మందికి ఎక్కువ టీకాలు వేశారు. అయితే, చొప్పదండిలో 1,093, హుజూరాబాద్లో 62, హుస్నాబాద్ నియోజకవర్గంలో మరో 606 మందికి మొదటి డోసు టీకాలు వేసినట్లయితే 100 శాతం పూర్తవుతుంది.
రెండో డోసులో రాష్ట్రంలోనే ప్రథమం
రెండో డోసులో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. ఇటీవల 15-18 ఏండ్లలోపు టీనేజర్లకు టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించినపుడు మంత్రి గంగుల కమలాకర్ సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జిల్లాలో కేవలం 25,930 మందికి టీకాలు వేసినట్లయితే రెండో డోసు వంద శాతం పూర్తవుతుంది. ఇందులో కరీంనగర్లో 15,323, చొప్పదండిలో 2,906, మానకొండూర్లో 3,168, హుస్నాబాద్లో 3,286, హుజూరాబాద్లో 1,247 మందికి ఇంకా రెండో డోసు టీకాలు వేయాల్సి ఉంది. అధికారులు ఇటు మొదటి, రెండు డోసుల టీకాలతో పాటు ప్రస్తుతం బూస్టర్ డోసు టీకాలు, 15-18 ఏండ్లలోపు టీనేజర్లకు టీకాలు వేస్తున్నారు. ఈ నెల 26 వరకు రెండో డోసు టీకాలు కూడా సంపూర్ణం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా వెల్లడించారు.
టీకా సక్సెస్తో నియంత్రణలో వైరస్
టీకాలు వేయడంలో కరీంనగర్ జిల్లా ముందంజలో ఉన్న నేపథ్యంలోనే జిల్లాలో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదని తెలుస్తోంది. రాష్ట్రంలో, దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండగా జిల్లాలో మాత్రం పాజిటివ్ కేసులు నియంత్రణలో ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు పెంచారు. మూడు నాలుగు రోజులుగా వంద మందికి పరీక్షలు చేయిస్తే 10 నుంచి 12 మందికి మాత్రమే పాజిటివ్ వస్తోంది. అయితే, వీరిలో టీకాలు వేయించుకున్న వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుండడంతో ఎక్కువ మంది దవాఖానల్లో అడ్మిట్ అవడం లేదు. ఇంట్లోనే ఐసొలేషన్ పాటిస్తున్నారు. వైరస్ మరీ ఎక్కువగా ఉంటే తప్ప దవాఖానకు వెళ్లాలనే ఆలోచన బాధితులకు రావడం లేదు. దీనికి కారణం టీకాలు విజయవంతం చేయడమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినా, నిబంధన ప్రకారం జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.