ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై కర్షకులు, టీఆర్ఎస్ నాయకుల మండిపాటు
కోరుట్ల నియోజకవర్గంలో అడ్డుకునే యత్నం
‘గో బ్యాక్’ అంటూ ప్లకార్డుల ప్రదర్శన
దిష్టిబొమ్మల దహనం
రైతులకు క్షమాపణ చెప్పేదాకా గ్రామాల్లోకి రానివ్వమని స్పష్టం
కోరుట్ల నెట్వర్క్, జనవరి 18 : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు నిరసన సెగ తగిలింది. పసుపు బోర్డు తెస్తానని, 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని నడిపిస్తానని ఎంపీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడంపై కర్షకుల్లో ఆగ్రహం పెల్లుబికింది. మంగళవారం ఆయన ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో పర్యటనకు రాగా, మల్లాపూర్ మండలం చిట్టాపూర్, మెట్పల్లి మండలం వేంపేట క్రాసింగ్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. అర్వింద్ ‘గో బ్యాక్’ అంటూ టీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. గెలిచిన ఐదు రోజుల్లోగా పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి, అలాగే వంద రోజుల్లో ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తానని మాట ఇచ్చి రైతులను మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే పర్యటనకు రావాలని అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
దిష్టిబొమ్మల దహనం
హామీలు నెరవేర్చకపోవడంపై కోరుట్ల పట్టణం, మండలంలోని అన్ని గ్రామాలు, అలాగే ఇబ్రహీంపట్నం మండలం డబ్బా, బర్దిపూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు, రైతులు ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అర్వింద్కు గ్రామాల్లో తిరిగే హక్కు లేదని, నియోజకవర్గంలో పర్యటిస్తే అడ్డుకొని తరిమికొడతామని హెచ్చరించారు. ఇచ్చిన మాట తప్పిన అర్వింద్ రైతులకు క్షమాపణ చెప్పి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.