నర్సరీలను సక్రమంగా నిర్వహించాలి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
వీణవంక, జనవరి 18: ప్రజల ఆర్థికాభివృద్ధి, గ్రామాల రూపురేఖలు మార్చడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. మంగళవారం మండలంలోని చల్లూరు, బేతిగల్ గ్రామాల్లో దళిత బంధు పథకం కింద మంజూరైన డెయిరీ పనులను పరిశీలించారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. కనపర్తిలో నర్సరీ సందర్శించారు. ఇప్పలపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. మండల కేంద్రంలో జరిగిన పల్లె ప్రగతి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఆయా చోట్ల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్థికాభివృద్ధి సాధించేలా దళితులకు తోడ్పాటునందించేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని రూపొందించారని చెప్పారు. మంజూరైన ప్రతి యూనిట్నూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ లబ్ధిదారులకు తగిన సూచనలు సలహాలు ఇస్తూ వారి పురోగతికి కృషి చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని, అందరికీ పౌష్టికాహారం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు సిద్ధం చేసిన పౌష్టికాహారాన్ని పరిశీలించి, అభినందించారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన వైకుంఠధామాలను వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా చేయాలని, సెగ్రిగేషన్ షెడ్లలోని చెత్తను సేకరించి అమ్మి గ్రామపంచాయతీల్లో జమ చేయాలని, నర్సరీలను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీలత, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో రాజేశ్వర్రావు, అంగన్వాడీ సూపర్వైజర్ శశి కిరణ్మయి, తహసీల్దార్ సరిత, ఆయా గ్రామాల సర్పంచులు మోరె సారయ్య, పర్లపెల్లి రమేశ్, ఎనగంటి విజయ, పొదిల జ్యోతి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.