కార్పొరేషన్, జనవరి 18: విద్యార్థులు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సర్కారు పాఠశాలలకు సెలవులు పొడిగిస్తే, ట్రస్మా నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని మాజీ మేయర్ రవీందర్సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఫీజులు రావనే భయంలో ఏదేదో మాట్లాడుతున్నారని, పిల్లల ఆరోగ్యం ముఖ్యమా.. ఫీజులు ముఖ్యమా..? చెప్పాలని ప్రశ్నించారు. మంగళవారం నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో విలేకరులతో మాట్లాడారు. కరోనా మూడో వేవ్లో వైరస్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని అనేక ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయని, ఇప్పటికే ఢిల్లీలో విద్యాసంస్థలన్నీ బంద్ చేయడం వల్లే కేసులు తగ్గుముఖం పడుతుండడం గమనించాలన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కరోనాతో గత రెండేళ్లలో చాలా కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని, ఆ సమయంలో కూడా ఈ ప్రైవేటు విద్యా సంస్థలు పేద, మధ్య తరగతి కుటుంబాల ముక్కు పిండి ఫీజులు వసూలు చేశాయని ఆరోపించారు. ట్రస్మా నాయకులకు కావాల్సింది ఫీజులు మాత్రమేనని, సీఎం కేసీఆర్కు మాత్రం ప్రజల ఆరోగ్యం ముఖ్యమని పేర్కొన్నారు. కరోనా టైంలో ఫీజులు వసూలు చేసిన యాజమాన్యాలు.. తమ సంస్థల్లో పని చేస్తున్న ఎంత మంది టీచర్లకు సరైన వేతనాలు ఇచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ట్రస్మా నాయకులపై డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేసులు పెట్టాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతామని, ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకువస్తామని చెప్పడంతో ట్రస్మా నేతలు అత్తిరిబిత్తిరి అవుతున్నారని విమర్శించారు. ఇకపై బ్లాక్మెయిల్ రాజకీయాలు నడవనని పేర్కొన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పేరెంట్స్ కమిటీలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై జిల్లా విద్యాధికారి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, పెండ్యాల మహేశ్కుమార్, శ్రీనివాస్, రాములు ఉన్నారు.