దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి లేదు
రాజకీయ లబ్ధి కోసమే కపట ప్రేమ చూపుతున్నరు
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
మానకొండూర్, జనవరి 18: బీజేపీ దళిత ద్రోహి అని, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులను సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులే అంటరాని వారిగా చిత్రీకరించి దాడులు చేస్తూ, కొట్టి చంపుతున్న ఘటనలు చాలా జరుగుతున్నాయని దుయ్యబట్టారు. ఇక్కడేమో రాష్ట్రంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎస్సీ నియోజకవర్గాలపై బీజేపీ నాయకులు కపట ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు. మంగళవారం మానకొండూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ వివిధ పథకాలు అమలు చేస్తున్నారని, మరి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకం ఒక్కటైనా ఉందా..? ఆత్మవిమర్శ చేసుకోవాలని బీజేపీ నాయకులకు సూచించారు. ‘దళితుల కోసం సీఎం కేసీఆర్ ఏం చేశాడని మాట్లాడుతున్న బండి సంజయ్ను మేం ఒక్కటే ప్రశ్నిస్తున్నాం.. నీవు కరీంనగర్ ఎంపీగా గెలిచిన ఈ మూడేళ్లలో నీ సొంత నియోజకవర్గంలో ఏనాడైనా ఏదైనా దళితవాడను సందర్శించావా..?’ అంటూ ప్రశ్నించారు. సంజయ్ ఎంపీగా ఒక్కసారి గెలువగానే వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని విమర్శించారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఏ ఒక్క ఎస్సీ నియోజకవర్గంలో బీజేపీకి డిపాజిట్ వచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. దళితులను బీజేపీ ఏవిధంగానైతే అంటరానివారిగా చూస్తుందో.. దళితులు కూడా బీజీపీని అంటరాని పార్టీగా చూస్తున్నారనే విషయం ఆ పార్టీ నాయకులు గమనించాలని హితవుపలికారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని, చర్చకు రాకుండా సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలపై అసభ్యంగా మాట్లాడితే నాలుకలు చీరేస్తామని హెచ్చరించారు. ఇక్కడ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముద్దసాని శ్రీనివాస్రెడ్డి, పడాల శంకరయ్య, టీఆర్ఎస్వీ నియోజకవర్గ కన్వీనర్ గుర్రం కిరణ్గౌడ్, నాయకులు ఎరవేణి రామాంజనేయులు, దండబోయిన శేఖర్, నెల్లి శంకర్, ఎరుకల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.