దట్నూర్ బ్రిడ్జికి రూ. 3 కోట్లు
గోదావరి ఎత్తిపోతల అదనపు పైప్లైన్కు రూ. 14.50 లక్షలు
ధర్మారం మండలంలోని మూడు మాట్ల నిర్మాణానికి రూ. 88.50 లక్షలు వెల్గటూర్ మండలం పాతగూడూరు-సూరారం బ్రిడ్జికి 2.87 కోట్లు మంజూరు
వెల్లడించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
గొల్లపల్లి/ ధర్మపురి/ ధర్మారం/ వెల్గటూర్ జనవరి 18: ధర్మపురి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల నెరవేరనున్నది. మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో ఆయాచోట్ల బ్రిడ్జిలు, ఇతర అభివృద్ధి పనులకు మోక్షం లభించనున్నది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషంలో మునిగితేలుతున్నారు. సీఎం కేసీఆర్, అమాత్యుడు కొప్పుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ మేరకు మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ వివరాలు వెల్లడించారు. గొల్లపల్లి మండలంలోని ధట్నూర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు, వెల్గటూరు మండలం రాజారాంపల్లి నుంచి బసంత్నగర్కు వెళ్లేదారిలోని పాతగూడురు-సూరారం గ్రామా ల మధ్య బ్రిడ్జికి రూ.2.87 కోట్లు మంజూరయ్యాయి. ధర్మపురి మండలం జైన శివారులోని గోదావరి ఒడ్డున గల ఎత్తిపోతల పథకానికి అదనపు పైప్లైన్ నిర్మాణానికి 14.50 లక్షలు, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పత్తిపాక, సాయంపేట, గోపాల్రావుపేట గ్రామాల శివారులోని ఒర్రెలపై మూడు మాట్ల నిర్మాణానికి రూ.88.50 లక్షలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణంతో ఇన్నాళ్లు ప్రజలు పడ్డ కష్టాలు గట్టెక్కనున్నాయి.
దట్నూర్ బ్రిడ్జి కల నెరవేరుతుండంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, కృషి చేసిన కొప్పుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వానకాలంలో వాగు దాటేందుకు అష్టకష్టాలు పడేవాళ్లమని ఇప్పుడు వంతెన నిర్మాణంతో 9 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గనున్నదని చెప్పారు. ఎత్తిపోతల పథకం అదనపు పైప్లైన్ నిర్మాణానికి మార్గం సుగమం కావడంపై జైన గ్రామస్తులు హర్షంవ్యక్తం చేశారు. గ్రామంలోని సహకార సంఘం కార్యాలయం ఎదుట సీఎం, మంత్రి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ధర్మారం మండలం పత్తిపాక శివారులో కుంట మాటు నిర్మాణానికి రూ. 21,05,000, సాయంపేట శివారులో కుమ్మరోళ్ల మాటుకు రూ.36,55,000, గోపాల్రావుపేట శివారులోని సౌట కాల్వ మాటు నిర్మాణానికి రూ.30,90,000 మంజూరయ్యాయి. దీంతో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్రెడ్డి, సర్పంచులు బద్దం సుజాత,చెనెల్లి సాయికుమార్,జనగామ అంజయ్య, ఎంపీటీసీ జనగామ లక్ష్మీ, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మంత్రి ఈశ్వర్కు కృతజ్ఞతలు తెలిపారు. వెల్గటూర్ మండలంలోని పాతుగూడుర్, సూరారం గ్రామాల మధ్య వారధి నిర్మాణంపై ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.