మౌలిక వసతుల కల్పన కోసం ‘మన ఊరు- మన బడి’
ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు
స్వాగతిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు
ఇంగ్లిష్ మీడియంపై పెరుగుతున్న మక్కువ
ఇప్పటికే అమలవుతున్న పాఠశాలలే నిదర్శనం
కరీంనగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే కాదు, పోటీ వాతావరణాన్ని తట్టుకునేందుకు అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టబోతున్నది. వచ్చే యేడాది నుంచే అమలు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఇదే సమయంలో ‘మన ఊరు.. మన బడి’ పేరిట మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నది. అందుకు సంబంధించి సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే కాగా.. సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి రానుండగా, పేద, మధ్య తరగతి వర్గాలు సంబురపడుతున్నాయి. ఇటు బడులు కూడా బలోపేతం కానుండగా, సర్కారు నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తున్నాయి.
2008లో సక్సెస్ స్కూల్ పేరిట ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడానికి నాటి సమైక్య ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 200లకుపైగా పిల్లలున్న 4,500పై చిలుకు ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లుగా ప్రకటించింది. అయితే ఆ మేరకు ఉపాధ్యాయులకు ఐదేళ్లపాటు ఏటా 15 నుంచి 20 రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, ఒక ఏడాది మాత్రమే ఇచ్చి ఆ తర్వాత చేతులు దులుపుకున్నది. దీంతో సక్సెస్ పాఠశాలలు ఆచరణలో విజయవంతం కాలేకపోయాయి. కాగా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అంటే.. 2016 నుంచి తిరిగి ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టేందుకు కొన్ని షరతులతో ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆ మేరకు.. ఒక వేళ ఏ బడిలోనైనా ఇంగ్లీషు మీడియాన్ని ప్రశపెట్టాలని భావిస్తే.. సదరు స్కూల్ కమిటీ, గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతోపాటు మరికొన్ని నిబంధనలను సూచించింది. ఆ మేరకు ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు జిల్లా విద్యాధికారి అలాగే ఆరు, ఏడు తరగతులకు ఆర్జేడీ.. ఎనిమిది, తొమ్మిది, పది తరగతులకు కమిషనర్ పర్మిషన్ ఇచ్చేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జిల్లా విద్యాధికారి వరకు అనుమతులు బాగానే వచ్చినా.. ఆ తర్వాత ఆర్జేడీ, కమిషనర్ స్థాయిలో పెడింగ్ పడుతూ వచ్చాయి. అయినా ఉమ్మడి జిల్లాలో వెయ్యికిపైగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమం నడుస్తున్నది.
2.5 లక్షల మందికి ప్రయోజనం..
ఉమ్మడి జిల్లాలో వెయ్యికిపైగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఇప్పటికే ఆంగ్లమాధ్యమాన్ని అమలు చేస్తున్నాయి. కానీ, సదరు పాఠశాలల్లో తెలుగు మీడియంలో చేరేందుకు విద్యార్థులు ఇష్టపడడం లేదు. అంటే మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం వైపు మొగ్గుచూపుతున్నారన్న విషయం స్పష్టమవుతున్నది. అంతేకాదు, భవిష్యత్లో పోటీ పడాలంటే.. ఆంగ్లంపై పట్టు తప్పనిసరిగా కనిపిస్తున్నది. మాతృభాషపై మమకారమున్నా.. సమాజంలో రాణించాలంటే విద్యార్థులు ఆంగ్లంపై పట్టుసాధించాల్సిన అవసరమున్నది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం అమలుకు నిర్ణయం తీసుకోవడంపై సర్వాత్ర హర్షం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్కారు బడుల్లో చదువుతున్న సుమారు 2.50 లక్షలకుపైగా మంది విద్యార్థులకు లాభం చేకూరనున్నది.
తల్లిదండ్రుల నుంచే డిమాండ్..
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న డిమాండ్ తల్లిదండ్రుల నుంచి కొంత కాలంగా వస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలు, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు మధ్య ఇంగ్లిష్లో కనిపిస్తున్న మార్పులు.. తద్వారా వారి భవిష్యత్ పై పడుతున్న ప్రభావం వంటి అనేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని.. తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం వైపు మొగ్గుచూపుతున్నారు. అంతేకాదు, ఆంగ్ల మాధ్యమంలో చదివించాలన్న కోరిక తల్లిదండ్రులకు ఉన్నా.. ఆయా పాఠశాలల్లో ఉన్న ఫీజులను భరించే శక్తి లేక మెజార్టీ తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలోనే చేర్చుకుంటూ వస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనికి తోడుగా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి ‘మన ఊరు.. మన బడి’ కింద 7.300 కోట్లు వెచ్చించేందుకు క్యాబినెట్ ఆమోద ముద్రవేసింది. తద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పడడమేకాదు.. ఇటు ఆంగ్లం మాధ్యమాన్ని అందుకోవడానికి విద్యార్థులకు అవకాశం కలుగుతున్నది.
సముచిత నిర్ణయం
నేను తిమ్మాపూర్ మండలం నల్లగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన సమయంలో తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని.. 6, 7 తరగతుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. అది మంచి ఫలితాలనిచ్చింది. తద్వారా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. అలాగే అప్పటి వరకు తెలుగు మీడియాన్ని ఎంచుకున్న పిల్లలంతా ఆంగ్లమీడియంలో చేరారు. ఏ ఒక్కరు కూడా తెలుగులో చేరేందుకు ఇష్టపడలేదు. దాదాపు అన్ని పాఠశాలల్లో ఇదే పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రికి అభినందనలు చెప్పాలి. అయితే ఆచరణలో పకడ్బందీగా అమలు చేయాలి. ఉపాధ్యాయులకు తర్ఫీదునివ్వాలి. – ప్రతాపరెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం
సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
వచ్చే యేడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. ప్రైవేటుకు దీటుగా రాణించాలంటే ఆంగ్ల మాధ్యమం తప్పనిసరిగా కనిపిస్తున్నది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు కూడా విద్యా వ్యవస్థను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం వల్ల పేద వర్గాల పిల్లలకు చాలా కలిసి వస్తుంది. పకడ్బందీగా అమలు చేస్తే మంచి ఫలితాలు రావడమే కాదు, ఆంగ్లమాధ్యమం చదివించలేని ఎంతో మంది తల్లిదండ్రులకు భరోసానిస్తుంది. అంతేకాదు ప్రైవేటు ఫీజులు మిగిలిపోయి.. సదరు కుటుంబాలు ఆర్థికంగా బలపడుతాయి. – చందురి రాజిరెడ్డి, టీఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి