జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్
‘నేనున్నా’ సంస్థ పదో వార్షికోత్సవ సంబురాలు ప్రారంభం
జూలపల్లి, అక్టోబర్ 17: సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్ కోరారు. రఘువీర్సింగ్ స్థాపించిన ‘నేనున్నా’ స్వచ్ఛంద సేవా సంస్థ పదో వార్షికోత్సవ సంబురాలు మం డల కేంద్రంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ తరఫున జూలపల్లి గ్రామానికి చెం దిన సంబారి శ్రేయ బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించగా రూ. 5 వేలు అందించి మరో ఐదేండ్లు రూ. 5 వేల చొప్పుల ఆర్థికసాయం చేస్తానని ప్రకటించారు. అలాగే దివ్యాంగుడు నెరువట్ల రవికి రూ. 5 వేలు, ఠాకూర్ అమూల్య పెండ్లి ఖర్చుల కోసం రూ. 5 వేల చొప్పుల అందజేసి మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి సేవా కార్యక్రమాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. సంస్థ సేవలు విస్తరించేందుకు గ్రామ కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. వచ్చే నెల 5వ తేదీలోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని, గ్రామ, మండల స్థాయి కమిటీల కార్యవర్గం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సంస్థ సభ్యులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. విద్య, వైద్యం, క్రీడా రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, పేదల పెండ్లిండ్లకు సహకరిస్తూ ఆదుకుంటున్నామని తెలిపారు. ఫౌండేషన్ తరపున నిరుద్యోగులను పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు మండల కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని వివరించారు. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు సంస్థ సభ్యులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ నాయకులు శాతళ్ల కాంతయ్య, మెండ మల్లేశం, కొమ్మ సతీశ్, మేర్గు రమేశ్, లాల్మహ్మద్, ఫజులుల్లా, పాటకుల మహేశ్, ఒల్లాజి స్వామి, గంగిపెల్లి శ్రీనివాస్, ఆవుల రాజు, అర్కిల్ల శంకర్ పాల్గొన్నారు.