యైటింక్లయిన్కాలనీ, అక్టోబర్ 17: గని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకుడు కెంగర్ల మల్లయ్య హామీ ఇచ్చారు. ఆదివారం ఆర్జీ-2 పరిధిలోని 8ఏ గనిలో మృతి చెందిన గని కార్మికుల 18వ సంతాపసభ సందర్భంగా స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారులకు ఉత్పత్తి, ఉత్పాదకతపై ఉన్న ప్రేమ గని కార్మికులు, వారి రక్షణపై ఏ మాత్రం లేదన్నారు. సంస్థలో పని చేస్తూ మృతి చెందిన కార్మికుల త్యాగాలను అధికారులు విస్మరించడం వారి నియంతృత్వ ధోరణికి నిదర్శమన్నారు. గని ప్రమాదంలో 10మంది కార్మికులు మృతి చెందడంపై నాడు అనేక పోరాటాలు చేసి కోర్టు ఆఫ్ ఎంక్వయిరీ వేయించామని, ఇందులో అధికారుల తప్పిదంతోనే ప్రమాదం జరిగిందని తేలినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారిపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. గని ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ఇప్పటికైనా అధికారులు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఓసీపీ-3 ప్రాజెక్టు అధికారి జీ మోహన్ రెడ్డి, మేనేజర్ రమేశ్, టీబీజీకేఎస్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, బాధిత కుటుంబీకులు మామిడి తిరుపతి, శ్రీనివాస్, నాయకులు కొత్త సత్యనారాయణ రెడ్డి, బదావత్ శంకర్నాయక్, బేతి చంద్రయ్య, ఎల్ ప్రకాశ్, కే రాజారత్నం, ఉల్లి మొగిలి, మార్కండేయ, సంజీవ్, నల్లగొండ రాజయ్య పాల్గొన్నారు.