మెట్ట భూముల్లో వైవిధ్య విధానాలు వరిని వదిలి..
ఆరుతడి పంటలు ఆదర్శ రైతులుగా గుర్తింపు
ఎల్లారెడ్డిపేట జనవరి 17;వారంతా నీళ్లులేక కన్నీళ్లను దిగమింగుకొని సేద్యాన్ని వదిలిపెట్టారు..కరెంట్ రాక కష్టాలపాలై నమ్ముకున్న నేలను విడిచిపెట్టారు..పెట్టుబడికి పైసల్లేక భూములను పడావుపెట్టి ‘ఉపాధి’ దారిలో ఆగమయ్యారు..ఇదంత గత కథ..సమైక్య పాలనలో మెట్టరైతుల వ్యథ.. కానీ తెలంగాణ రాష్ట్రంలో వారి తలరాతలు మారుతున్నాయి. గలగలపారుతున్న నీటితో పడావుబడ్డ భూములు పచ్చబడ్డాయి.. 24 గంటల కరెంట్తో పంట భూములు జలసవ్వడులతో సిరులు చిందిస్తున్నాయి.. పంటల సాగుకు అప్పులు తెచ్చిన చోట సర్కారు సాయంతో వారి మోముల్లో వెలుగులు నిండుతున్నాయి..సర్కారు మాటను స్ఫూర్తిగా తీసుకొని వరిని వదిలి తీరొక్క పంటలు పండిస్తూ ‘ఆదర్శం’గా నిలుస్తున్నారు.
మూస పద్ధతులకు స్వస్తి చెప్పారు..ఆధునిక సాగు ‘బడి’లో అక్షరాలు దిద్దారు.. మెట్టభూముల్లో వైవిధ్య సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నీళ్లు, నాణ్యమైన కరెంటు, పెట్టుబడికి డబ్బుల్లేక అరిగోస పడ్డ మెట్టప్రాంతంలో సులువైన పంటగా వరినే నమ్ముకుని ఇబ్బందులు పడ్డ రైతులు నేడు కొత్త పంథాను అనుసరిస్తూ ఫలాలను అందుకుంటున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న ఆదర్శరైతులు ఇటీవల ప్రభుత్వం పక్షాన జిల్లా కేంద్రంలో ప్రశంసా పత్రాలను సైతం అందుకున్నారు. వేరువేరు రైతుల విభిన్నపంటల తీరుపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహ్మద్ ఇబ్రహీం గంభీరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(బయోసైన్స్ )గా విధులు నిర్వహిస్తున్నాడు. అప్పటి వరకు వ్యవసాయంపై ఎలాంటి అవగాహన లేకున్నప్పటికీ లాక్డౌన్ సమయంలో తమ తండ్రులు, తాతలు చేసిన సేద్యం నేర్చుకున్నాడు. తమకు ఉన్న నాలుగెకరాల భూమిలో సేంద్రియ ఎరువులను వాడుతూ, కూలీల కొరతను తగ్గించుకునేందుకు డ్రమ్సీడ్, వెదజల్లే విధానాన్ని అనుసరించి తన నాలుగెకరాల్లో ఆధునిక పంటలైన 1509, కేఎన్ఎం, 1638, నల్లవరి విత్తనోత్పత్తిని కూడా చేశాడు. విత్తనోత్పత్తి ద్వారా సుమారు రూ.2లక్షల ఆదాయం పొందినట్లు ఇబ్రహీం తెలిపాడు.
పందిరి సాగు.. ఆదాయం బాగు
రాజన్నపేటకు చెందిన సంకూరి శంకర్ 19 ఏండ్ల పాటు గల్ఫ్ బాట పట్టి 2013లో ఇంటికి చేరుకుని తనకు ఉన్న ఎకరం భూమిలో ఆధునిక సేద్యం చేసేందుకు పూనుకున్నాడు. ఇందుకోసం 2016లో భార్య రజిత మహిళా సంఘంలో రూ. లక్ష రుణం తీసుకుని 20 గుంటల భూమిలో రాతి కనీలతో పందిరి వేయించాడు. రూ.5వేల ఖర్చుతో తన 20గుంటల భూమిలో పందిరిసాగుతో మంచి దిగుబడితో పాటు ఆదాయం పొందుతున్నాడు. పందిరి సాగులో కూరగాయల సాగులో గడ్డిపెరగకుండా మల్చింగ్ షీట్లు, వేయించాడు. తన భూమిలో బీర, కాకర, సొరకాయ, అలసంద, అంతర పంటలుగా టమాట, గోరుచిక్కుడు, బెండకాయ, కొత్తిమీర, ఉల్లిపంటలు వేసి తన 20గుంటల భూమిలో నెలకు రూ.40వేలు సంపాదిస్తున్నాడు.
కూరగాయల సాగు అలవాటయ్యింది….
మొదట గల్ఫ్ దేశంలకెయి అచ్చినంక అందరు వరిపంటనే ఏత్తున్నరు నేను కూరగాయలు పండించాలనుకున్న. మా భార్య రజిత పేరుమీద మహిళా సంఘంల అప్పు తీసుకుని కూరగాయలు పండించెతందుకు పందిరేయించిన. ఏవో భూంరెడ్డి ఎన్నో మంచి సలహాలిచ్చిండు. కొత్త ఇత్తునాలు, పద్దతులపై మంచిగ సెప్పుతడు. నా 20 గుంటల పొలంల పండించిన కూరగాయలతో మాకుటుంబం మంచిగ గడిచిపోతుంది. నెలకు దాదాపు 30 నుంచి 40వేలు అత్తున్నయి. అదే కూరగాయల సాగు నాకు అలవాటయ్యింది.-సంకూరి శంకర్, రాజన్నపేట, ఎల్లారెడ్డిపేట
సౌడు భూముల్లో చిరుధాన్యాలు..
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన వంగల నర్సింహారెడ్డి తనకు వారసత్వంగా వచ్చిన రెండున్నర ఎకరాలతో పాటు దాని చుట్టుపక్కల 30 ఎకరాల సౌడు భూమిని కౌలుకు తీసుకుని ఆదర్శ సేద్యం చేస్తున్నాడు. కరోనా కాలంలో ఆహారపు తీరుపై అందరిలో విశ్లేషణ మొదలయ్యింది. బలవర్థకమైన ఆహారం స్థానంలో వరిని మాత్రమే వినియోగిస్తున్న సమయంలో అందరూ నర్సింహారెడ్డి పండించిన పంటల వైపు మరలిచూశారు. అతను పండించే జొన్నలు, రాగులు, సామలు, ఊదలు, నువ్వులు, తాను పండించిన ప్రాంతంలో డిమాండ్ లేదని తెలిసినా ఎక్కడ డిమాండ్ ఉందో కనుక్కుని అక్కడికి ఎగుమతి చేస్తూ రిస్క్ అయినా వ్యవసాయం చేసే తీరును పదిమందికి పరిచయం చేసేలా ముందుకు సాగుతున్నాడు. ఏటా సుమారు రూ. 12 లక్షల ఆదాయం పొందుతుండగా అందులో రూ.4లక్షలు ఖర్చులు పోనూ 8 లక్షల మిగులును సొంతం చేసుకుంటున్నాడు. అలాగే సేద్యంలో వరి వెదజల్లే పద్ధతి, డ్రమ్సీడ్, డ్రైసీడ్ పద్ధతిని కూడా అనుసరిస్తూ కూలీల సమస్యకు తానే పరిష్కారం చూపుతున్నాడు.
రిస్క్ ఉంటది.. లాభం వస్తది..
కొత్త వ్యవసాయ పద్ధతుల్లో రిస్క్ ఉంటది అట్లాగే లాభం కూడా ఉంటుంది. వరి వేయడం, పండించినంత సులువుగా ఇతర పంటలు పండించలేం కానీ ఇతర పంటలు వేయడం, లాభాలు ఆర్జించడంలో పదిమందికి ఎలా పండించాలో చెప్పడం అలవాటయితే తప్పకుండా కొత్తపంట వైపే ఆలోచిస్తారు. నేను మా భార్య ఇద్దరం 30 ఎకరాల భూమిలో రకరకాల పంటలు పండిస్తున్నాం. యాసంగి అయినా సరే ఇప్పుడు మా భూమిలో పత్తి పంటవేశాను అది నా నమ్మకం అంతే. పదిమంది ఏం వేస్తున్నారో అది వేయడం కన్నా నా వరకు నేను ఏం పంటవేయాలో నిర్ణయించుకునే వేస్తాను. అందుకే నేను పండించిన చిరుధాన్యాలు మనదగ్గర కొనకపోతే గుంటూరు పంపిస్తున్న. ఆధునిక సేధ్యంలో రిస్క్ కామన్ కానీ అందుకు తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది.