Shankar Goud : ఆర్టీసీ సమ్మె రెండో రోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కన్నుమూసిన కోల శంకర్ గౌడ్ (Shankar Goud) అంత్యక్రియలు పూర్తయ్యాయి. అడుగడుగునా పోలీసుల నిర్భందం కొనసాగగా ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ శంకర్ గౌడ్కు కుటుంబసభ్యులు, ఆర్టీసీ ఉద్యోగులు కన్నీటి నివాళి అర్పించారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల సాధనకు, కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం తీసుకు వచ్చేందుకు ప్రాణాలు అర్పించిన ఆయనకు వీడ్కోలు పలికేందుకు జనం భారీగా తరలివచ్చారు. శంకర్ గౌడ్ అమర్రహే నినాదాలతో.. కళాకారుల ఆటపాటలతో అంతిమయాత్ర సాగింది.
నర్సంపేట డిపోలో డ్రైవర్గా పని చేస్తున్న కోల శంకర్ గౌడ్ గురువారం సమ్మెలో పాల్గొని.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఆయన్ను తొలుత నర్సంపేట ఆస్పత్రికి, ఆపై వరంగల్లోని ఎంజీఏ ఆస్త్రత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించాలనుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తూ ఆయన మార్గమధ్యలోనే మరణించారు.
శుక్రవారం ఉదయం శంకర్గౌడ్ మృతదేహాన్ని ముత్తోజిపేటకు తీసుకొచ్చిన పోలీసులు..కుటుంబానికి అప్పగించారు. అయితే.. ప్రభుత్వ వైఖరితోనే శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆయన మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లాలని భావించారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఆర్టీసీ నాయకుల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో, ముత్తోజిపేటలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. చివరకు ఆర్టీసీ జేఏసీ నేతలతో పోలీసులు మంతనాలు జరిపి.. అంత్యక్రియలు పూర్తి చేశారు.