రాంనగర్, అక్టోబర్ 12 : ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాల సరిహద్దుల్లో 17 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా భారీ మొత్తంలో నగదు కానీ, వస్తువులు కానీ తీసుకెళ్లరాదని ఆంక్షలు ఉండడంతో వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లాల సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
ప్రతి చెక్పోస్టులో ఎస్ఐ స్థాయి అధికారి నేతృత్వంలో సిబ్బందిని నియమించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు నిరంతరం తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బు, వస్తువులు, ఆభరణాలు కానీ తీసుకెళ్లే అవకాశం లేదు. తనిఖీల్లో పట్టుబడితే సరైన ఆధారాలు చూపిస్తే నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు, ఆధారాలు లేకపోతే రెవెన్యూ అధికారులకు అప్పగించడంతో పాటు కేసు నమోదు చేసి, ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందిస్తారు. కోడ్ ముగిసేంత వరకు నిబంధనలు పాటించకపోతే ఎంతటి వారికైనా చెక్ పడాల్సిందే.