అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై అధికసంఖ్యలో రాక
కమలాపూర్లో కండువాలు కప్పి ఆహ్వానించిన విప్ సుమన్, ఎమ్మెల్యే ధర్మారెడ్డి
కమలాపూర్/కమలాపూర్రూరల్: ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్లో చేరికల పర్వం కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమానికి జై కొడుతూ.. వివిధ సంఘాలే కాదు ప్రతిపక్ష పార్టీల్లోని చిన్నా.. పెద్దా క్యాడర్ అంతా తరలివస్తున్నది. శనివారం కమలాపూర్ మండలం మర్రిపెల్లి గూడెం, గూడూరు, శనిగరం గ్రామాల్లో విప్ సుమన్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో కమలం నేతలు, పలు సంఘాల నాయకులు కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ వెంటే ఉంటామని ప్రకటించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలుకాలి
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు పలుకుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. కమలాపూర్ మండలం మర్రిపెల్లి గూడెంలో బీజేపీకి చెందిన పలువురు గ్రామస్తులు టీఆర్ఎస్లో చేరగా, కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు గడపగడపకూ అందుతున్నాయని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీటీతో గెలిపించాలని కోరారు.
జైకొట్టిన గూడూరు నాయకులు..
కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన యువకులు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన గణేశ్, సాయి, రాజు, అజయ్, ప్రణయ్తోపాటు 20మంది టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలోకి వచ్చినట్లు యువకులు ప్రకటించారు. అలాగే శనిగరం గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు బండి రమేశ్, వాల్మీకి సంఘం గౌరవాధ్యక్షుడు తట్ల గణేశ్, యాదవ సంఘం మండల కార్యదర్శి కొడారి రఘునందన్, బొమ్మ అనిల్యాదవ్ చేరగా, ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆహ్వానించారు. ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్, మండల ఇన్చార్జి పేరియాల రవీందర్రావు, నాయకులు సత్యనారాయణరావు, ఇంద్రసేనారెడ్డి తదితరులున్నారు.