నియోజకవర్గ ప్రజలకు ఈటల చేసిందేమీ లేదు
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని వర్గాలకు మేలు
ఆయనను నిండు మనసుతో ఆశీర్వదించాలి
టీఆర్ఎస్ సీనియర్ నేత జోగినిపల్లి శ్రీనివాస్రావు
దేశాయిపల్లిలో బేడ బుడగజంగాల ఆత్మీయ సమ్మేళనానికి హాజరు
వీణవంక, జూలై 16: టీఆర్ఎస్తోనే బేడ, బుడగ జంగాల అభివృద్ధి సాధ్యమని టీఆర్ఎస్ సీనియర్ నేత జోగినపల్లి శ్రీనివాస్రావు ఉద్ఘాటించారు. సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ఏడేండ్లు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీలేదని విమర్శించారు. మండలంలోని దేశాయిపల్లి పీఎస్కె గార్డెన్స్లో శుక్రవారం జరిగిన బేడ, బుడగజంగాల ఆత్మీయ సమ్మేళనానికి శ్రీనివాస్రావు హాజరై మాట్లాడారు. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బుడగ జంగాలకు వ్యక్తిగత రుణాలు, కమ్యూనిటీహాళ్లు, వ్యాపారాభివృద్ధికి వాహనాలు అందజేసిందని చెప్పారు. కానీ ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన ఈటల అభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు. కరోనా దెబ్బకు చిరు వ్యాపారాలు చేసుకొనే బుడగజంగాలు నష్టపోయారని, వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ పాలనతో దేశప్రజలు విరక్తి చెందారన్నారు. ఇబ్బడిముబ్బడిగా పెట్రో ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని దుయ్యబట్టారు. రైతు, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పార్టీలోకి ఈటల ఎందుకు వెళ్లాడో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి, టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ వాల బాలకిషన్రావు, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు మ్యాకల ఎల్లారెడ్డి, బుడగ జంగాల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తిరుమలయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి మోటం వెంకటేశ్, నియోజకవర్గ అధ్యక్షుడు మోటం రాంచంద్రం, రామ్కుమార్, యూత్ ప్రెసిడెంట్ చింతల సంపత్ పాల్గొన్నారు.