హుజూరాబాద్ పట్టణ అభివృద్ధి వేగవంతం
సుందరీకరణకు రాష్ట్ర సర్కారు 60 కోట్లు మంజూరు
ముమ్మరంగా సీసీరోడ్ల సుందరీకరణ, భగీరథ పనులు
ప్రజాప్రతినిధులు, ప్రజల హర్షం
సర్కారుకు కృతజ్ఞతలు
హుజూరాబాద్, జూలై 14: హుజూరాబాద్ పట్టణం కొన్నేళ్లుగా అభివృద్ధిలో వెనుకబడి పోయింది. పట్టణం శరవేగంగా విస్తరిస్తుండగా, అందుకు అనుగుణంగా పనులు జరగలేదు. ఇందుకు గత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిర్లక్ష్యమేనని పట్టణ ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. సరైన ప్రణాళికలు రూపొందించకపోవడంతోనే అభివృద్ధి కుంటు పడిందని వాపోతున్నారు. కాగా, ఆయన రాజీనామా చేసిన వెంటనే ప్రభుత్వం బల్దియా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టింది. పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు రూ.35కోట్లు, పట్టణ పరిధిలోని వరంగల్-కరీంనగర్ ప్రధాన రహదారికి రూ.25కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగి ప్రణాళికలు రూపొందించి పనులు మొదలు పెట్టింది. సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన పూజలు చేసి కొబ్బరికాయ కొడుతున్న మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి, పక్కన చైర్పర్సన్ గందె రాధిక(ఫైల్)
సుందరంగా అంతర్గత రోడ్లు
పట్టణంలో కొన్ని వాడలకు మాత్రమే సీసీ రోడ్లు ఉన్నాయి. శివారు కాలనీల్లో సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో మొత్తం 30డివిజన్లు ఉండగా, ప్రతి డివిజన్కు సరాసరిగా 1.20 కోట్లు కేటాయించగా, అధికారులు, మున్సిపల్ పాలకవర్గం రంగంలోకి దిగింది. బోర్నపల్లి, కొత్తపల్లిలో సీసీ రోడ్లు, మురుగు కాలువల పనులు ప్రారంభించి, శరవేగంగా చేస్తున్నారు. అలాగే మిషన్ భగీరథ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన నడుస్తున్నాయి.
ప్రధాన రహదారికి రూ.25కోట్లు
పట్టణ పరిధిలోని కొత్తపల్లిలోని కాకతీయ కాలువ నుంచి కేసీ క్యాంపులో కాకతీయ కాలువ దాకా కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారి అభివృద్ధి కోసం రూ.25కోట్లు మంజూరు చేసింది. వీటితో సెంట్రల్ లైటింగ్ సిస్టంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించనున్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపార దుకాణాల దాకా మట్టి కనబడకుండా రోడ్డును తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో పాటు సైదాపూర్ రోడ్డుకు మహర్దశ పట్టనున్నది. దుమ్ముధూళితో ఉన్న రహదారి అభివృద్ధి కోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వానికి నివేదిక అందిన వెంటనే నిధులు మంజూరు చేయనున్నారు.
సంతోషంగా ఉన్నది..
పట్టణం అన్న పేరే గాని ఇన్నాళ్లూ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. అసలు పట్టించుకున్నోళ్లే లేరు. మురుగు నీళ్లు రోడ్ల మీదకు వచ్చేవి. ఇండ్ల పరిసరాలన్నీ కంపుకొట్టేవి. కానీ ఇప్పుడు అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. మిషన్ భగీరథ నీళ్ల కోసం పనులు ముమ్మరంగా చేస్తున్నారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి గంగులకు ప్రత్యేక ధన్యవాదాలు.
ఈటల పట్టించుకోలేదు..
పట్టణ అభివృద్ధి గురించి అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ నేత ఈటల ఏనాడూ పట్టించుకోలేదు. రెండేళ్ల నుంచి ప్రభుత్వాన్ని ఒక రూపాయి కూడా అడగకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ఆయన బయటికి పోయిన తర్వాత పరిస్థితిని తెలుసుకొని సర్కారు నిధులు మంజూరు చేసింది. కొన్ని రోజుల్లో పట్టణంలో మట్టి రోడ్డు కనబడదు. ఇంటింటికీ తప్పకుండా త్వరలోనే మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతాయి.