చలామణి చేస్తున్న ఐదుగురు దొంగల ముఠా అరెస్టు
రూ.4 లక్షలు స్వాధీనం
పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి
పెద్దపల్లిటౌన్/ సుల్తానాబాద్ జనవరి 14 : పెద్దపల్లి సబ్-డివిజన్లో నకిలీ నోట్లు చెలామని చేస్తున్న ఐదుగురు దొంగల ముఠాను సుల్తానాబాద్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారనే సమాచారం మేరకు సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా సుల్తానాబాద్ చెరువుకట్ట వద్ద కాల్వశ్రీరాంపూర్కు చెందిన చల్లా రాయమల్లు, బసంత్నగర్ జీడీనగర్కు చెందిన కొమిరె రాజు, కాల్వశ్రీరాంపూర్కు చెందిన దారంగుల వెంకటి నుంచి దాదాపు రూ.77 400 నకిలీ నోట్లు, రూ.4 లక్షల విలువైన ప్రింటర్, తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్లో నకిలీ నోట్లు ముద్రిస్తున్నారని వారు తెలుపడంతో కరీంనగర్కు వెళ్లి కాల్వశ్రీరాంపూర్కు చెందిన దుగ్యాల అనిల్ను, ముఠాలో మరో సభ్యుడు కాల్వశ్రీరాంపూర్కు పెండం సురేశ్ను అదుపులోకి తీసుకున్నారు. దొంగ నోట్లు ముద్రించిన ముఠా సభ్యుడు చల్లా రాయమల్లు గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నాడు. సీపీఐ (ఎంఎల్) పీపుల్స్వార్ గ్రూప్లో నాటు బాంబులు తయారు చేస్తూ ప్రమాదం బారిన పడ్డాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ నోట్లు చలామణి చేస్తున్నాడు. ప్రజలను తప్పుదారి పట్టిస్టుస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించి, నగదు పారితోషికం అందించారు. ఇక్కడ సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు ఉపేందర్, అశోక్ రెడ్డి, ఏఎస్ఐ తిరుపతి ఉన్నారు.